‘పార్టీకోసం పని చేస్తా’, రాహుల్ గాంధీ ప్రకటన, అంటే మళ్ళీ అధ్యక్ష పదవిని చేపడతారా ? హైకమాండ్ విధేయుల్లో ఆశలు
పార్టీలో అందరూ కోరుకుంటున్నట్టు తను పార్టీకోసం పని చేయదలుచుకుంటున్నానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ, అదే సమయంలో..
పార్టీలో అందరూ కోరుకుంటున్నట్టు తను పార్టీకోసం పని చేయదలుచుకుంటున్నానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ, అదే సమయంలో సంస్థను ప్రక్షాళన చేయాలంటూ అధిష్టానానికి లేఖ రాసిన 23 మంది అసమ్మతీయులు, ఇంకా విధేయులు శనివారం పార్టీ అధినేత సోనియా గాంధీతో సమావేశమైన వేళ..రాహుల్ ఈ ప్రకటన చేయడం విశేషం. సోనియా నివాసం 10 జనపథ్ లాన్స్ లో జరిగిన ఈ మీటింగ్ లో రాహుల్ తో బాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కొన్ని నెలల పాటు సాగిన విభేదాలు, పొరపొచ్చాల అనంతరం దాదాపు రాజీ దిశగా ఈ సమావేశం జరిగినట్టు భావిస్తున్నారు. కాంగ్రెస్ లో అందరి అభిమతం ప్రకారం పార్టీ కోసం కృషి చేయదలుచుకుంటున్నట్టు రాహుల్ తెలిపారని ఈ సమావేశానంతరం పార్టీ నేత పవన్ బన్సాల్ వెల్లడించారు. రాహుల్ గాంధీని ఎవరూ విమర్శించలేదన్నారు.
గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీ, ఆనంద్ శర్మ, శశిథరూర్, పి.చిదంబరం సహా పలువురు నేతలు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఈ సమావేశంలో..పార్టీ భవిష్యత్తు గురించి తామంతా చర్చించామని పృథ్వీ రాజ్ చవాన్ వెల్లడించారు. ఇది నిర్మాణాత్మకంగా సాగిందన్నారు. గోవా నుంచి సోనియా ఢిల్లీకి తిరిగి వచ్చిన అనంతరం మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆమెతో రెండు సార్లు సమావేశమై ఈ మీటింగ్ కి ఆమెను ఒప్పించినట్టు తెలుస్తోంది. అసమ్మతి నేతలను బుజ్జగించడానికి ఈ మీటింగ్ దోహదపడగలదని ఆయన సోనియాకు నచ్ఛజెప్పినట్టు సమాచారం. ఇక రాహుల్ చేసిన తాజా ప్రకటనతో పార్టీ హైకమాండ్ విధేయుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. రణదీప్ సింగ్ సూర్జేవాలా వంటి వారు కాంగ్రెస్ కి రాహుల్ నాయకత్వం ఎంతయినా అవసరమని అంటున్నారు. వచ్ఛే ఏడాదిపార్టీ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలో తామంతా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తామని సూర్జేవాలా తెలిపారు. జరిగేందేదో జరిగిందని, ఇక అంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.