పాత చీరతో సరికొత్త ఆలోచన..
మహారాష్ట్రలోని పుణెకు చెందిన మౌమితా అనే టీచర్ లింకెడిన్లో పెట్టిన ఫొటో ఇప్పుడు వైరల్గా మారింది

కరోనా మహమ్మారి విద్యార్థులకు ఉపాధ్యాయులకు కొత్త కష్టాలను తీసుకువచ్చింది. కొత్త కొత్త విన్యాసాలు చేయిస్తోంది. లాక్ డౌన్ అందరినీ ఇంటికే పరిమితం చేసింది. విద్యా సంవత్సరం మొదలవుతుండడంతో అధ్యాపకులు పాఠాలు బోధించేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చెప్పేందుకు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు సొంత ఐడియాలను జత కలుపుతున్నారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన మౌమితా అనే టీచర్ లింకెడిన్లో పెట్టిన ఫొటో ఇప్పుడు వైరల్గా మారింది. ఇంటి నుంచి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలనుకున్నది. కాకపోతే వీడియో తీయడానికి ఎవరూ లేరు. పైగా ట్రైపాడ్ కూడా లేదు. దీంతో ఆమెకు ఒక ఐడియా తట్టింది. ఇంట్లో ఒక రూమ్ను క్లాస్ రూంగా మార్చుకున్నది. గోడకు బ్లాక్బోర్డ్ ఫిక్స్ చేసింది. బోర్డు కనిపించేలా తన మొబైల్ను ఎదురుగా హ్యాంగర్ ద్వారా వేలాడదీసింది. గాలికి అటూ ఇటూ కదలకుండా ఉండేందుకు కుర్చీకి గట్టిగా కట్టేసింది. అదీ కూడా పాతచీరను కట్ చేసి తాడుగా ఉపయోగించింది. ట్రైపాడు లేదని అందుకే దేశీ టెక్నాలజీతో ఇలా ఆన్లైన్ క్లాసులు నిర్వహించానని మౌమితా చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మౌమితా చేసిన పనిని నెటిజన్స్ తెగ పొగిడేస్తున్నారు. మోడ్రన్ టెక్నాలజీలో పాత చీరతో సరికొత్త ఆలోచనను జోడించింది.
