కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంత్యోదయ అన్న యోజన పథకానికి సంబంధించి కీలక ప్రకటన వెలువరించింది. దీంతో దివ్యాంగులకు లబ్ది చేకూరనుంది. దివ్యాంగులకు రేషన్ స్కీమ్ ప్రయోజనాలు అందడం లేదనే అంశంపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం చేసిన ఆదేశాలను సీరియస్గా తీసుకున్నామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అంత్యోదయ అన్న యోజన పథకాన్ని 2000 డిసెంబర్ 25న ప్రారంభించింది. దీని ద్వారా అతి తక్కువ ధరలకే పేదలకు బియ్యం లేదా గోధుమలు అందిస్తోంది. 2003లోనే ఈ పథకాన్ని దివ్యాంగులకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నామని, కానీ ఎందువల్లనో పలుచోట్లు వీరికి పథకం యొక్క ప్రయోజనాలు లభించడం లేదని రామ్ విలాస్ పాశ్వాన్ అభిప్రాయపడ్డారు.
అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు కలిగిన వారికి 35 కేజీల బియ్యం లేదా గోధుమలు రాష్ట్రాలే అందించాలని రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు. అంత్యోదయ అన్న యోజన పథకంలో చేరిన వారికి ఒక ప్రత్యేకమైన కార్డు ఇస్తారు. దీని ద్వారా రేషన్ బియ్యం లేదా గోధుమలు తీసుకోవచ్చు. అర్హులు బియ్యం అయితే కేజీకి రూ.3 చొప్పున..గోధుమలు అయితే రూ.2 చొప్పున 35 కేజీలు పొందొచ్చు. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మరో విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పింది. గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద రేషన్ కార్డు కలిగిన వారికి ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని ఫ్రీగా అందజేయాలని రాష్ట్రాలకు మరోసారి తెలియజేసింది.