PM SVANidhi scheme: వీధి వ్యాపారుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పధకాన్ని ప్రారంభించింది. సుమారు మూడు లక్షల మంది వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్ కింద రుణాలను పంపిణీ చేశారు. అనంతరం యూపీలో వీధి వ్యాపారస్తులతో ప్రధాని మాట్లాడారు.
మధ్య దళారులు లేకుండా నేరుగా వీధి వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వడం శుభ పరిణామం అని ఆయన అన్నారు. లోన్లు శాంక్షన్ చేసిన బ్యాంక్ ఉద్యోగులను ఆయన అభినందించారు. కరోనా లాక్డౌన్తో ఆర్థికంగా చితికిపోయిన వీధి వ్యాపారస్తులను ఆదుకోవడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశవ్యాప్తంగా 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయని… అందులో 12 లక్షల మందికి లోన్లు మంజూరు చేశామని మోదీ తెలిపారు.
కాగా, జన్ధన్ అకౌంట్లను విపక్షాలు ఎద్దేవా చేశాయని, అయితే ఇప్పుడు ఆ అకౌంట్లే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అటు రోడ్ సైడ్ బండి లేదా వీధి, రహదారిపై దుకాణాలను నడిపేవారి మాత్రమే ఈ రుణాలను ఇస్తుండగా.. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించేవారికి ఏడు శాతం వడ్డీ రాయితీ కూడా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.