బీజేపీతో తెలంగాణకు ఒరిగిందేమీలేదుః హరీష్ రావు
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య మాటల దాడి పెరిగింది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ ల మధ్య రాజకీయ దుమారం రాజుకుంది.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీల మధ్య మాటల దాడి పెరిగింది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ ల మధ్య రాజకీయ దుమారం రాజుకుంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మంత్రి హరీష్ రావు, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇదే క్రమంగా ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలోని తొగుటలో టీఆర్ఎస్ యువ గర్జన ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులను కష్టాల్లోకి నెడుతుందన్నారు. వ్యవసాయ పంపు సెట్ల వద్ద మీటర్లు తెచ్చిపెట్టి.. రైతులకు ఇబ్బందులపాలు చేస్తుందని మంత్రి హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాకలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి వాపు మాత్రమే.. నిజమైన బలం టీఆర్ఎస్ పార్టీదే అని హరీష్ రావు తెలిపారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను టీఆర్ఎస్ పార్టీ సాధించి పెట్టిందని గుర్తు చేసిన మంత్రి… రాష్ర్ట ప్రకటనను వెనక్కి తీసుకుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తే… కిషన్ రెడ్డి మాత్రం పారిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ తెచ్చింది తాము అని ఈరోజు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు చేయని పనులను టీఆర్ఎస్ సర్కార్ చేసి చూపించిందన్నారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న హరీష్.. అన్నదాతలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నామని చెప్పారు. మనకు రావాల్సిన నిధులు, నీళ్లను తెచ్చుకున్నామని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలన్నారు. ఆరేళ్లలో ఉద్యోగ నియామకాలు కరువయ్యాయన్నారు.
మరోవైపు కాంగ్రెస్ ను కూడా టార్గెట్ చేసిన హరీష్ రావు.. అంతే స్థాయిలో ఆరోపించారు. నమ్ముకున్న నేతలను కాంగ్రెస్ విస్మరిస్తుందన్న హరీష్.. ముత్యం రెడ్డి మంచి నాయకుడని కాంగ్రెస్ మొసలి కన్నీరుకారుస్తోంది. అదే నిజమయితే కాంగ్రెస్ పార్టీ 2018లో టికెట్ ఎందుకు ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. కళ్లబొళ్లి మాటలతో ప్రజల వద్దకు వచ్చే నేతలకు బుద్ధి చెప్పాలని మంత్రి.. ఎప్పుడు ప్రజల మధ్య ఉండే టీఆర్ఎస్ అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.