తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన నగరాలతోపాటు గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన నదులు ప్రమాదానికి మించి ప్రవహిస్తున్నాయి. ఇక జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇదిలావుంటే వాతావరణ శాఖ మరిన్ని వర్షాలు పడుతాయనే సమాచారాన్ని మోసుకొచ్చింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు, చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.