మిత్రుల మధ్య సరదా పందెం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మద్యం బాటిల్లో సోడా, నీరు కలపకుండా సేవించాలని ఇద్దరు మిత్రులు కాసిన పెందెంలో ఒకరు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గురువారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఎస్ సాయిలు (40) తన ఐదుగురు మిత్రులతో కలిసి పట్టణ శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు. చేనులో అందరు కలిసి మద్యం సేవిస్తుండగా, మాటల మధ్యలో సాయిలు, మరో మిత్రుడి మధ్య వాదన పెరిగి బెట్టింగ్కు దిగారు. సోడా, వాటర్ కలుపుకోకుండా ఫుల్ బాటిల్ తాగేందుకు పందెం కాశారు. అప్పటికీ మద్యం మత్తులో ఉన్న సాయిలు అతని స్నేహితుడు.. ఇందుకు ఒకే అనేశాడు.
ఇరువురు సోడా, నీరు కలపకుండా ఫుల్ బాటిల్ సేవించారు. ఇరువురు మత్తులోకి జారిపోగా తోటి మిత్రులు వీరిని ఇళ్లకు పంపించారు. అయితే, సాయిలు ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు విరోచనాలు చేసుకున్నారు. అనంతరం స్పృహ కోల్పోవడంతో అతన్ని కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించినప్పటికీ అతను అప్పటికే మృతి చెందాడు. మృతుని భార్య గంగామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ పోలీసులు తెలిపారు.