పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం బెంగళూరులో జరిగిన ర్యాలీలో అమూల్య లియోనా అనే యువతి ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ చేసిన నినాదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. దీంతో.. యువతి ప్రవర్తించిన తీరుపై ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కూతుర్ని జైల్లో పెట్టినా తప్పులేదని, ఆమె కోసం తాను ఎలాంటి న్యాయపోరాటం చేయబోనని యువతి తండ్రి స్పష్టంగా చెప్పారు.
బెంగళూరులో ఎంపి, ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో అమూల్య చేసిన వ్యాఖ్యలు టీవీలో, సోషల్మీడియాలో వైరల్ కాగానే కొందరు స్థానిక మీడియా విలేకరులు ఆమె తండ్రిని సంప్రదించగా ఆయన తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నా కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఇలా మాట్లాడొద్దని చాలా సార్లు చెప్పినా అమూల్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావట్లేదు. ఆమెను జైల్లో పెట్టినా.. పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తన వల్ల నా కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అని యువతి తండ్రి చెప్పుకొచ్చారు.
నివేదికల ప్రకారం, అముల్యకు కేవలం 19 సంవత్సరాలు, బెంగళూరు కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చేస్తున్నారు. అయితే.. పాక్కు అనుకూల నినాదాలు చేసినందుకు గానూ అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం నేడు కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ కేసులో ఆమెకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ సంఘటన జరిగిన వెంటనే, కొంతమంది స్థానిక భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆమె తండ్రిని కలిసారు. సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం), ఎన్పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా బెంగళూరులో నిన్న సభ నిర్వహించారు. మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ సభకు హాజరై ప్రసంగించారు. అయితే ఓవైసీ ప్రసంగం తర్వాత అమూల్య లియోన్ ఒక్కసారిగా వేదికపైకి ఎక్కి పాక్కు అనుకూలంగా నినాదాలు చేసింది.
ఈ సంఘటనతో షాక్కు గురైన ఓవైసీ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి మైక్ను లాక్కొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ యువతి వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్లిపోయారు. కాగా.. అమూల్య నినాదాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఓవైసీ స్పష్టం చేశారు.