సిటీ ట్రాఫిక్ జామ్‌కు కేటీఆర్ చెక్

|

Nov 09, 2020 | 5:55 PM

హైదరాబాద్ నగరంలో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్‌కు శాశ్వత పరిష్కారం సాధించే విషయంలో మంత్రి కేటీఆర్ కీలక కామెంట్లు చేశారు. నగరంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ట్రాఫిక్ జామ్ సమస్య అతిపెద్ద సమస్యగా మారిందని ఆయనన్నారు.

సిటీ ట్రాఫిక్ జామ్‌కు కేటీఆర్ చెక్
Follow us on

KTR check to city traffic-jam:  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు పలు అభివృద్ది కార్యక్రమలు చేపట్టింది ప్రభుత్వం. దాంట్లో భాగంగా సోమవారం మూడు ప్రధాన లింక్ రోడ్లను పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు ప్రారంభించారు. నగరంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కలిపించడంలోను తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. లింకు రోడ్లతో నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ జామ్స్‌కు కొంతైనా పరిష్కారం లభిస్తుందంటున్నారు మంత్రి.

దశాబ్దాల తరబడి వేధిస్తున్న సమస్యలకు విస్తృత వసతులతో చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. విశాలమైన లింక్‌ రోడ్లతో ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారం చూపుతోంది. ఐటీకి కేంద్రమైన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అత్యంత కీలకమైన మూడు డివిజన్లలో రూ.42 కోట్లతో నిర్మించిన లింక్‌ రహదారులను మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. వాటి ద్వారా పలు కాలనీల నుంచి ప్రధాన రహదారితోపాటు నేషనల్‌ హైవేకు త్వరగా, సులువుగా చేరుకునే వెసులుబాటు లభించనుంది.

హైదర్‌నగర్‌ డివిజన్‌ మిత్ర హిల్స్‌ నుంచి మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వరకు 120 ఫీట్ల రోడ్డు, కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని ఓల్డ్‌ ముంబై రోడ్డు లెదర్‌ పార్కు నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 45 వరకు, గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని ఓల్డ్‌ ముంబై హైవే నుంచి ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ మీదుగా ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజీ వరకు మూడు లింకు రోడ్లను ప్రజా రవాణాకు అందుబాటులోకి తెచ్చారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య నుండి పూర్తి స్థాయిలో బయట పడేందుకు మాస్టర్ ప్లాన్స్ పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 35 లింక్ రోడ్లకు సంబంధించి పనులు జరుగుతున్నాయని, నగరంలో మొత్తం 137 లింక్స్ రోడ్స్ నిర్మించ తలపెట్టామని ఆయన వివరించారు. వీటి నిర్మాణానికి మొత్తం రూ. 313.65 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ అధికారులు లాక్‌డౌన్‌ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని లింక్‌ రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. అత్యంత కీలకమైన ట్రాఫిక్ సమస్యకు ఈ లింక్ రోడ్ల ద్వారా పరిష్కారం లభించనున్నదని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లింక్ రోడ్ల నిర్మాణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రోడ్లను కనెక్ట్ చేసే ఈ లింక్ రోడ్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతోపాటు సమయం కూడా వృధా కాకుండా ఉంటుందని అంటున్నారు.

ALSO READ: సేవ్ మాన్సస్ ప్రచారంపై మండిపడ్డ సంచయిత

తెలంగాణ నూతన ఎల‌క్ట్రిక్ వెహి‌కిల్‌ పాల‌సీ విడుదల

జీహెచ్ఎంసీకి హడ్కో అవార్డు.. కేటీఆర్ ప్రశంస