తెలంగాణ నూతన ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ విడుదల
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సంయుక్తంగా శుక్రవారం ఉదయం విడుదల చేశారు.
వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోనే తయారీ యూనిట్లు, చార్జింగ్ పాయింట్లను పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రజలు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది. రాష్ర్ట ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) పాలసీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సంయుక్తంగా శుక్రవారం ఉదయం విడుదల చేశారు. జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్లో పాలసీ విధానాన్ని మంత్రులు ప్రకటించారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మార్చాలన్న లక్ష్యంతో ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చిన్నట్లు మంత్రి కేటీ.రామారావు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన నిల్వలకు కొత్త విధానం అమలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. 2020-2030 వరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగంపై విధి విధానాలపై మంత్రి ప్రకటన చేశారు.
Ministers @KTRTRS and @puvvada_ajay unveiled the Telangana Electric Vehicle and Energy Storage Policy 2020-2030 at Telangana Electric Vehicle Summit in Hyderabad. Principal Secretaries @jayesh_ranjan and Sunil Sharma also participated. pic.twitter.com/z1plOe3o6I
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) October 30, 2020
ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం అద్భుతంగా విజయవంతం కాబోతుందని.. ఈ వాహనాలకు హబ్గా తెలంగాణను మార్చబోతున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయని అన్నారు. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ తయారీ కంపెనీలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ మేరకు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో భూములు అందుబాటులో ఉన్నాయని.. మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్ అందుబాటులో ఉందని.. సరిగా వినియోగించుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో తెలంగాణకు 2.8 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్ విధానం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన రాయితీలను భవిష్యత్లో మరింత పెంచేందుకు కృషి చేస్తామని కేటీఆర్ వివరించారు.
రాష్ట్రంలో కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పలు రాయితీలను కల్పిస్తున్నారు. ఈ విధానం అమలుకు ఉన్నతాధికారులతో నిర్వాహక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆయా పరిశ్రమలు, మెగా ప్రాజెక్టులు రూ. 200 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టడం జరిగింది. పెట్టుబడి మొత్తంలో మెగా ప్రాజెక్టులకు 25 శాతం రాయితీ కల్పించనున్నారు. విద్యుత్ ఛార్జీలు, స్టాంపు, రిజి స్ట్రేషన్ ఫీజులపై రాయితీలు ఇవ్వనున్నారు.
మొదటి 2 లక్షల ద్విచక్ర వాహనాలకు రహదారి పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. 5 వేల ఫోర్ వీలర్లు, 10 వేల లైట్ గూడ్స్, క్యారియర్లకు పూర్తిగా పన్ను రద్దు చేయనున్నారు. ప్రజా రవాణాలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు మొదలు పెట్టింది. పార్కింగ్, ఛార్జింగ్ సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకనున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు చేసి ప్రత్యేక రుసుములు వసూలు చేయనున్నారు. జాతీయ రహదారులపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.