
స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఒక హిందువే అన్న కమల్ హాసన్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. కమల్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే హిందూ సంఘాలు, భజ్రంగ్ దళ్తో పాటు పలువురు బాలీవుడ్ నటులు కూడా ఖండించారు. అయితే తాజాగా తమిళనాడు మంత్రి కమల్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమల్ చేసిన వ్యాఖ్యలకు ఆయన నాలుకను తెగ్గోయాల్సిందేనని మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ ఓట్ల కోసమే కమల్ హాసన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. ఎవరో ఒకరు చేసిన పనికి మొత్తం కమ్యూనిటీనీ నిందించడం సరికాదన్నారు. కమల్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోమవారం తమిళనాడులోని అరవకురిచిలో ఎన్నికల ప్రచారంలో కమల్ హాసన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే తొలి భారత హిందు ఉగ్రవాది అని పేర్కొన్నారు. కమల్ ప్రచారం చేసిన ఆ నియోజకవర్గంలో ముస్లింల మెజారిటీ ఎక్కువగా ఉండటంతో.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ విమర్శిస్తోంది.