మోదీతో భేటీ.. కెసీఆర్ ఎజెండా ఇదే.. !

|

Oct 03, 2019 | 12:38 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏం చేసినా సంచలనమే. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మైత్రి విషయంతో అందరికీ షాకిచ్చిన సీఎం కెసీఆర్.. ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంలోను జగన్ మోహన్ రెడ్డి ప్రమాణానికి హాజరవడానికే ప్రాధాన్యతనిచ్చారు. ప్రధాని, ఏపీసీఎం లిద్దరు ఒకే రోజు ప్రమాణం చేస్తుంటే.. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలకే తొలి ప్రాధాన్యమని చాటారు కెసీఆర్. అయితే దానిపై ఎన్నో కథనాలు.. మరెన్నో ఊహాగానాలు వచ్చినా.. కెసీఆర్ మొక్కవోని పట్టుదలతో […]

మోదీతో భేటీ.. కెసీఆర్ ఎజెండా ఇదే.. !
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏం చేసినా సంచలనమే. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మైత్రి విషయంతో అందరికీ షాకిచ్చిన సీఎం కెసీఆర్.. ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంలోను జగన్ మోహన్ రెడ్డి ప్రమాణానికి హాజరవడానికే ప్రాధాన్యతనిచ్చారు. ప్రధాని, ఏపీసీఎం లిద్దరు ఒకే రోజు ప్రమాణం చేస్తుంటే.. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలకే తొలి ప్రాధాన్యమని చాటారు కెసీఆర్. అయితే దానిపై ఎన్నో కథనాలు.. మరెన్నో ఊహాగానాలు వచ్చినా.. కెసీఆర్ మొక్కవోని పట్టుదలతో తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలపైనే ఫోకస్ చేశారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసుకోవచ్చన్న గట్టి సంకల్పంతో పని చేస్తున్నారు కెసీఆర్. అయితే.. ఉన్నట్లుండి ఢిల్లీ పర్యటనకు కెసీఆర్ ఎజెండా ఖరారు చేసుకున్నారు.

గురువారం ఢిల్లీ వెళుతున్నట్లు తెలంగాణ సీఎంఓ నుంచి ప్రకటన వెలువడిన వెంటనే రాజకీయ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళడం.. ప్రధాన మంత్రితో భేటీ అవడం పెద్దగా కొత్తేమీ కాదు.. కానీ.. పది నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపితో ఉప్పు..నిప్పు లాంటి హాట్ హాట్ సంబంధాలను నెరపుతున్న కెసీఆర్.. సడన్ గా ఢిల్లీ వెళ్ళడం.. అదీ ప్రధానితో భేటీ కోసమే వెళ్ళడంతో రాజకీయ వర్గాలను అశ్చర్యపరిచింది. ఆగస్టు నెలలో ఢిల్లీలో జరిగిన మావోయిస్టు ప్రబావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి కెసీఆర్ వెళ్ళలేదు.. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీని పంపారు. మోదీని, అమిత్ షాని కల్వడం ఇష్టం లేకనే కెసీఆర్ ఆ భేటీకి వెళ్ళలేదని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది.

అయితే.. రాష్ట్ర ప్రయోజనాలే తన ప్రధాన ఎజెండా అని మరోసారి చాటుకున్న కెసీఆర్.. అందుకోసం గొంగళి పురుగును సైతం ముద్దు పెట్టుకుంటానని గతంలో అనేవారు. తాజాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పొలిటికల్ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి మరీ ఢిల్లీ పయనమై మోదీని కల్వబోతున్నారు కెసీఆర్.

దేశం ఆర్థిక మాంద్యం వైపు వెళుతున్న తరుణంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం దృష్టి పెట్టింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాలు సైతం ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయాన్ని కెసీఆర్.. ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో తేటతెల్లం చేశారు. ప్రస్తుతం ప్రధానితో భేటీ అవుతున్న కెసీఆర్.. తెలంగాణ రాష్ట్ర తీసుకుంటున్న చర్యలను వివరించి.. కేంద్ర సాయాన్ని కోరే అవకాశం వుంది.

అదే సమయంలో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన యురేనియం తవ్వకాల వివాదంపై కూడా ప్రధాని జోక్యాన్నికోరేందుకు తెలంగాణ సీఎం ఎజెండా సిద్దం చేసుకున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో యురేనియం తవ్వకాల ఆలోచనను విరమించుకోవాలని కెసీఆర్ కోరనున్నట్లు సమాచారం. గోదావరి నదీజలాలను కృష్ణా నదికి తరలించే బృహత్తర పథకానికి కేంద్ర సాయాన్ని కోరేందుకు కెసీఆర్ అభ్యర్థనను సిద్దం చేసుకున్నారు. రాజధాని హైదరాబాద్ లో చేపట్టనున్న రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం సాయాన్ని కోరాలని కెసీఆర్ రెడీ అవుతున్నారు. మొత్తానికి భారీ ప్రణాళికతోనే కెసీఆర్ ఢిల్లీ పయనమైనట్లు విశ్వసనీయ సమాచారం.

తాను ఒక్కడినే ప్రధాన మంత్రితో భేటీ అవడమే కాకుండా.. తనయుడు.. తెలంగాణ మంత్రి వర్గంలో కీలకమైన కెటీఆర్ ను ముందుగానే ఢిల్లీకి పంపిన కెసీఆర్.. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీకి క్లియర్ కట్ ఎజెండా నిర్దేశించినట్లు సమాచారం. అందుకే కేసీఆర్ కంటే ముందు హస్తినకు బయలు దేరారు కెటీఆర్. తాజా పర్యటనలో కెసీఆర్ వ్యూహంపై దేశంలోని ప్రధాన పార్టీలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.