జెఎన్‌యు ఘటన.. చిక్కుల్లో వాట్సాప్, గూగుల్, ఫేస్‌బుక్ ?

| Edited By: Ravi Kiran

Jan 13, 2020 | 2:26 PM

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఘటనలకు సంబంధించి వాట్సాప్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5 న యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన సంఘటనల తాలూకు సీసీటీవీ ఫుటేజీ, వాట్సాప్ మెసేజెస్, ఇతర డేటాను ప్రిజర్వ్ చేయాలని (భద్రపరచాలని) కోరుతూ ముగ్గురు ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని కోర్టు వీటికి నోటీసులు పంపింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ దీనిపై స్పందించాలని […]

జెఎన్‌యు ఘటన.. చిక్కుల్లో వాట్సాప్, గూగుల్, ఫేస్‌బుక్ ?
Follow us on

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఘటనలకు సంబంధించి వాట్సాప్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5 న యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన సంఘటనల తాలూకు సీసీటీవీ ఫుటేజీ, వాట్సాప్ మెసేజెస్, ఇతర డేటాను ప్రిజర్వ్ చేయాలని (భద్రపరచాలని) కోరుతూ ముగ్గురు ప్రొఫెసర్లు దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని కోర్టు వీటికి నోటీసులు పంపింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ దీనిపై స్పందించాలని కూడా కోరింది. సీసీటీవీ ఫుటేజీ, వాట్సాప్ డేటాను భద్రపరచాలని తాము ఇదివరకే జెఎన్‌యు అధికారులకు లేఖలు రాశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అమిత్ పరమేశ్వరన్, శుక్లా సావంత్, అతుల్ సూద్ అనే ప్రొఫెసర్లు కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు, ఢిల్లీ ప్రభుత్వానికి కూడా తగిన ఆదేశాలివ్వాలని వీరు అభ్యర్థించారు.

‘యూనిటీ ఎగైనెస్ట్ లెఫ్ట్’, ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఆర్ఎస్ఎస్’ పేరిట సర్క్యులేట్ అయిన వాట్సాప్ గ్రూపుల డేటాను బయటపెట్టాలని ఈ అధ్యాపకులు కోరారు. ఈ డేటాలో సందేశాలు, ఫోటోలు, వీడియోలు, ఈ గ్రూపు సభ్యుల ఫోన్ నెంబర్లు ఉన్నాయి. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి పోలీసులకు ఇంకా ఎలాంటి సమాచారమూ అందలేదని ప్రభుత్వ న్యాయవాది రాహుల్ మెహ్రా కోర్టుకు తెలిపారు.
ఈ నెల 5న ముఖాలకు మాస్కులు, చేత కర్రలు, ఇతర ఆయుధాలు ధరించిన వ్యక్తులు మూడు హాస్టళ్లలో ప్రవేశించి చేసిన దాడుల్లో కనీసం 34 మంది గాయపడిన సంగతి విదితమే. అయితే ఆ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయకపోగా.. బాధితులపైనే కేసులు పెట్టారు. విద్యార్ధి సంఘం నేత ఐషేఘోష్ మీద మరో రెండు కేసులు నమోదయ్యాయి. వర్సిటీ సర్వర్ రూమ్‌లో జరిగిన విధ్వంసానికి సంబంధించి ఆమెతో సహా పలువురు విద్యార్థులపై ఖాకీలు ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేశారు.