కెనడాలో జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ఎనిమిది మంది తమ సత్తా చాటారు. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారతీయులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన న్యూ డెమొక్రటిక్ పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. కాగా, ఈ పార్టీకి సిక్కు మతస్తుడైన జగ్మీత్సింగ్ సారధ్యం వహిస్తుండటం విశేషం. తాజా ఎన్నికల్లో 87 మంది సభ్యులు గల శాసనసభలో ఎన్డీపీకి 55 సీట్లు దక్కించుకుని అధికారాన్ని తిరిగి దక్కించుకుంది.
శనివారం వెల్లడైన ప్రాధమిక ఫలితాల్లో.. రిచ్మండ్-క్వీన్స్బర్గ్ ప్రాంతం నుంచి అమన్ సింగ్ గెలుపొందగా.. ఉప సభాపతి రాజ్ చౌహాన్ బర్నాబే ఎడ్మండ్స్ నుంచి, కార్మిక మంత్రి హ్యారీ బైన్స్ – సర్రే న్యూటన్ నుంచి, జగ్రూప్ బ్రార్ -సర్రే ఫ్లీట్వుడ్, రవి కహ్లోన్ -డెల్టా నార్త్ నియోజక వర్గాల నుంచి విజయం సాధించారు. ఇక, ఎన్డీపీ పార్టీ తరపున విజయం సాధించిన భారత సంతతి మహిళలు మాజీ మంత్రి జిన్నీ సిమ్స్, నికీ శర్మ, రచనా సింగ్ గెలుపు బాట ఎగురవేశారు.
కాగా, ఐదు లక్షల పోస్టల్ వోట్లను ఇంకా లెక్కించాల్సి ఉంది. తాము తుది కౌంటింగ్ కోసం వేచిచూస్తున్నామని.. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటం, ప్రజలకు అవసరమైన సేవలు, సదుపాయాల కల్పన తదితర కీలక అంశాలపై దృష్టి సారిస్తామని విజేతలు హామీ ఇచ్చారు.