India Corona Cases: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తున్నాయి. కొత్తగా 9,16,951 పరీక్షలు చేయగా.. 18,222 మందికి కొవిడ్ వైరస్ బారిన పడినట్లు తేలింది. మొత్తం బాధితుల సంఖ్య 1,04,31,639కు చేరింది. ఈ మహమ్మారి వైరస్ కారణంగా 228 మంది ప్రాణాలు విడువగా.. మొత్తం మృతుల సంఖ్య 1,50,798కి చేరింది. తాజాగా 19,253 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య 1,00,56,651కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2, 24,190 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 96.39 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు స్థిరంగా 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 15 రోజులుగా కరోనా మరణాలు 300 దిగువనే నమోదవడం ఊరటనిచ్చే అంశం. అయితే రెండు రోజులుగా రోజూవారీ కేసుల్లో కాస్త పెరుగుదల కనిపిస్తోంది.
పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.
Also Read :