జ్వరం,దగ్గు,జలుబు లాంటి ఎలాంటి బహిర్గత అనారోగ్య లక్షణాలు లేకుండా ఉన్న 50 ఏండ్ల వయస్సులోపు కోవిడ్ పేషేంట్లను గాంధీ ఆసుపత్రి నుంచి వారివారి ఇండ్లకు హోం క్వారంటైన్కు తరలిస్తున్నారు. ఈమేరకు సోమవారం మొత్తం 393మంది కరోనా పాజిటివ్ పేషేంట్లను గాంధీ నుంచి క్వారంటైన్కు తరలించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరిటెండెంట్ ఫ్రొ.డా.ఎం.రాజారావు పేర్కొన్నారు. తమ ఇండ్లల్లో ప్రత్యేక గది వసతి కలిగి ఉన్న 310 మందిని హోంక్వారంటైన్కు, మిగితా 83 మందిని అమీర్పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించినట్లు ఆయన వివరించారు.
ఇందుకు గాంధీనుంచి ప్రత్యేక 30 అంబులెన్స్లు, మూడు బస్సులను వినియోగించారు. ఇలా రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉన్న వారి ఆరోగ్య స్థితిగతులపై పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే పేషేంట్లు ఒక వేళ ఏదైనా అనారోగ్యానికి గురైతే వెంటనే కోవిడ్ నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలిపి, తగిన సూచనలు, వైద్యం పొందవచ్చన్నారు.