కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు కొత్తవి కావు : రజత్ కుమార్

| Edited By: Pardhasaradhi Peri

Jun 05, 2020 | 4:15 PM

తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీ జలాల వినియోగంపై పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్ లో సమావేశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులతో పాటు నిపుణులు హాజరయ్యారు.

కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులు కొత్తవి కావు : రజత్ కుమార్
Follow us on

గోదావరి జలాల వినియోగంపై టెలిమెట్రీ ఏర్పాటు కోసం బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసిందని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీ జలాల వినియోగంపై పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాద్ లో సమావేశమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులతో పాటు నిపుణులు హాజరయ్యారు.
తెలంగాణ తరుపున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు. గతంలో గోదావరి జలాల్లోంచి 967.14 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు రజత్ కుమార్. ఈ జలాలను వాడుకోవడంలో అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. గోదావరి కేటాయింపుల్లో నీటిని ఎక్కడైనా వాడుకోవచ్చని ట్రైబ్యునల్ స్పష్టంగా చెప్పిందన్నారు రజత్ కుమార్. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన జలాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం సాగుతుందన్నారు. ఇప్పటికే కృష్ణా,గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ లు ఇవ్వాలని బోర్డులు పదేపదే కోరుతున్నాయని.. ప్రభుత్వ అనుమతితో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కొత్తగా తెలంగాణలో ఎలాంటి ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టలేదన్న రజత్ కుమార్.. కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులను కొత్తవిగా పరిగణించాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు.
గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు నీరు తరలిస్తున్నందున మాకు 45 టీఎంసీలు అదనంగా రావాలని బోర్డును కోరామని రజత్ కుమార్ తెలిపారు. పోతిరెడ్డిపాడుపై రాతపూర్వకంగా కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేస్తామని, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అన్ని విషయాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ వాదనలను వినిపిస్తామన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు పూర్తి కానందున, రైతులకు న్యాయం జరగనందునే తెలంగాణ పోరాటం నీళ్లు నిధులు కోసమే సాగిందన్న రజత్ కుమార్ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడి ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేశారు.