రైతు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రధాని మోదీకి రక్తంతో అన్నదాతల లేఖ, ముంబైలోనూ నిరసన, అంబాలాలో భారీ ర్యాలీ
రైతు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు మంగళవారం ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాశారు. తమ తోటి సోదరుల కోసం తమ రక్తాన్ని ధారపోయడానికైనా సిధ్ధమే నన్నారు. కాగా ముంబైలో..
Farmers Protest:రైతు చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు మంగళవారం ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాశారు. తమ తోటి సోదరుల కోసం తమ రక్తాన్ని ధారపోయడానికైనా సిధ్ధమే నన్నారు. కాగా ముంబైలో హఠాత్తుగా పెద్ద సంఖ్యలో అన్నదాతలు నిరసనకు పూనుకొన్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళనతో నోయిడా, ఘజియాబాద్, చల్లా సరిహద్దులను మూసివేశారు. ఢిల్లీ నుంచి ఘాజీపూర్ వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అంబాలాలో అన్నదాతలు నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. తమకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆహ్వానమూ అందలేదని, రైతు సంఘాలు తెలిపాయి. చర్చల కోసం తాము వేచి చూస్తున్నామని కొన్ని సంఘాలు వెల్లడించాయి. అయితే భారతీయ కిసాన్ యూనియన్ వంటి పెద్ద సంఘాలు మాత్రం దీనిపై స్పందించలేదు. చర్చల కోసం తేదీని నిర్ణయించాలని కేంద్రం వీరికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కానీ నిర్దిష్ట ప్రతిపాదనలు లేకుండా చర్చలకు రాబోమని ఈ యూనియన్లు అంటున్నాయి.
అటు-ఇండియన్ కెనడియన్ సింగర్ జాజి బీ సింఘు బోర్డర్ వద్ద రైతులను ఉద్దేశించి ప్రసంగించడం విశేషం.