కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆగిపోయిన ఫ్లైట్ సర్వీసులు దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి. సోమవారం ఒక్క రోజే 532 డొమెస్టిక్ విమాన సర్వీసులు నడిచాయని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ విమానాల్లో మొత్తం 39,231మంది పాసింజర్స్ గమ్యస్థానాలకు చేరినట్టు వివరించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ట్విటర్లో ఈ వివరాలు పొందుపరిచారు. మంగళవారం నుంచి ఆంధ్రప్రదేశ్కు, ఈ నెల 28 నుంచి బెంగాల్కు విమాన సర్వీసులు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. మున్ముందు ఈ సర్వీసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని ఆయన వివరించారు. మరోవైపు, ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి 243 విమానాల రాకపోకలు జరిగాయి. ఢిల్లీకి వచ్చిన విమానాలు 118 కాగా.. ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన విమానాలు 125 అని అధికారులు వెల్లడించారు. మరో 82 విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి.