Dharani Portal Training : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే ముహుర్తానికి డేట్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ర్టంలోని తహసీల్దార్లకు, డిప్యూటీ తహసీల్దార్లకు ఘట్కేసర్లో మంగళవారం శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. ఈ నెల 29న మద్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ను ప్రారంభించనున్నారు.
29న పోర్టల్ ప్రారంభించగానే రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. ఫలితంగా ఒకే రోజులో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. అటు.. ధరణి ట్రయల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ బాధ్యతలను తాసిల్దార్కు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ బాధ్యతను సబ్రిజిస్ట్రార్లకు అప్పగించిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు తాసిల్దార్లు ఈ నెల 18 నుంచే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియపై సాధన చేస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కో తాసిల్దార్ సగటున 20కిపైగా ట్రయల్స్ నిర్వహించారు. కొన్నిచోట్ల 30-40 నమూనా లావాదేవీలు జరిగినట్టు సమాచారం. ఈ ట్రయల్స్ ఇంకా కొనసాగుతాయని తెలుస్తోంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ట్రయల్స్ చేస్తున్నారు తాసిల్దార్లు.