సంచలనం రేపుతున్న ప్రజావేదిక కూల్చివేత..!

| Edited By:

Jun 26, 2019 | 9:33 AM

ప్రజావేదిక కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రజావేదిక కూల్చివేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు తప్పుబడుతున్నారు. జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని, అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని కొందరు సపోర్టు చేస్తే.. మరికొందరు ప్రజావేదిక కూల్చివేతను తప్పుబట్టారు. ప్రజావేదిక ప్రజాధనంతో నిర్మించిందని.. దాన్ని కూల్చేయడం అంటే ప్రజాధనం వృథా చెయ్యడమే అన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తామని జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ […]

సంచలనం రేపుతున్న ప్రజావేదిక కూల్చివేత..!
Follow us on

ప్రజావేదిక కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రజావేదిక కూల్చివేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు తప్పుబడుతున్నారు. జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని, అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలని కొందరు సపోర్టు చేస్తే.. మరికొందరు ప్రజావేదిక కూల్చివేతను తప్పుబట్టారు. ప్రజావేదిక ప్రజాధనంతో నిర్మించిందని.. దాన్ని కూల్చేయడం అంటే ప్రజాధనం వృథా చెయ్యడమే అన్నారు.

టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తామని జగన్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ప్రజావేదిక ప్రజల అవసరాలు తీర్చేందుకు నిర్మించిన భవనం అని.. అలాంటి భవనాన్ని కూల్చివేయడం సరికాదన్నారు. ప్రజావేదిక ప్రాంతం గత 50 ఏళ్లలో ఎప్పుడూ ముంపునకు గురికాలేదన్నారు. కరకట్టపై ప్రజావేదికతో పాటు చాలా కట్టడాలు ఉన్నాయనీ, వాటిని కూడా తొలగిస్తారా? అని ప్రశ్నించారు.

అవినీతి కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ అవినీతికి వ్యతిరేకమని ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. జగన్ కేబినెట్‌లో ఉన్న బొత్స, అవంతిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. అలాంటి జగన్ అవినీతిరహిత పాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చట్టపరంగా అన్ని అనుమతులతోనే ప్రజావేదిక నిర్మించామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రజల అవసరాల కోసం, ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం ప్రజావేదిక. అక్రమ కట్టడం అని ఎలా అంటారని వారు ఆరోపించారు. ఇది కేవలం ప్రజావేదికను తమకు కేటాయించాల్సి వస్తుందనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర విభజన తరువాత అమరావతిలో సమావేశ భవనాలు లేవు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు అవకాశం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఏడాదిన్నరపాటు ప్రైవేటు కల్యాణ మండపాల్లో సమావేశాలు నిర్వహించుకోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ప్రజావసరాల కోసం ప్రభుత్వ నిధులతో ప్రజావేదిక నిర్మాణం జరిగిందని గుర్తుచేశారు. చంద్రబాబుకు ప్రజావేదిక భవనం కేటాయించాలని ప్రభుత్వాన్ని అడిగామని, తమ అభ్యర్థనపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు ఏకపక్షంగా కూల్చేయాలని నిర్ణయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తానికి ప్రజావేదిక కూల్చ వద్దంటూ పిటిషనర్ శ్రీనివాస్ తరపు న్యాయవాది కృష్ణయ్య నిన్న అర్థరాత్రి హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రజావేదిక అక్రమ భవనం కావడంతో కూల్చివేత నిలుపుదలకు స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని న్యాయవాదులు చెబుతున్నారు. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ అధ్వర్యంలో ప్రజావేదిక కూల్చివేత ప్రక్రయ పూర్తయింది. అదే సమయంలో చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుని అమరావతికి రావడంతో.. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ప్రజావేదిక సమీపంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక ఇప్పుడు వైసీపీ, టీడీపీల మధ్య ఏం జరుగుతుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రజావేదిక ఇష్యూ పై ఇరు పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు చాలాకాలం తర్వాత మంచి సీఎంని చూస్తున్నామనే ప్రశంసలు వస్తున్నాయి. ఇదే దూకుడు, ఇదే నిజాయితీ.. అన్ని విషయాల్లోనూ పాటించాలని కోరుతున్నారు. తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందే అంటున్నారు. చెప్పింది చేయడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం చాలా కష్టం. ఒకవేళ అది చేయగలిగితే అద్భుతమే అవుతుంది. చాలా ఏళ్ల తర్వాత ప్రజలకు మంచి పాలన అందుతుందని అంటున్నారు.