నివర్ తుఫాన్ను మరచిపోకముందే- మరోసారి తుఫాన్ బంగాళాఖాతంలో ఎంట్రీ ఇస్తోంది. ఈసారి టార్గెట్ మాత్రం శ్రీలంక. ప్రస్తుతం బురేవి తుఫాన్.. వాయుగుండంలా ఉంది. 24 గంటల్లో తుఫాన్గా మారుతుందని అంచనాలు వస్తున్నాయి.
తుఫాన్ శ్రీలంక తీరంలో ఉన్నప్పటికీ, దాని ప్రభావం మనదేశంపై కూడా కనిపిస్తోంది. తూర్పుతీరంలోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు నౌకలను, విమానాలను రక్షణశాఖ సిద్ధం చేస్తోంది.
బుధవారం రాత్రి తుఫాన్ లంక తీరందాటే అవకాశం ఉంది. దీంతో కేరళ, తమిళనాడుకు రెడ్వార్నింగ్ జారీ అయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంగా గాలులు వస్తాయి. హిందూ మహాసముద్రంలో ఈ ఏడాది బురేవి ఐదో తుఫాన్. ఇప్పటికే ఉంఫన్, నిసర్గ, గతి, నివర్ తుఫాన్లు మనదేశం మీద దాడిచేశాయి.
బురేవి దెబ్బకు బుధవారం రాయలసీమ, యానాం, ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంటున్నారు. నెల్లూరు,ప్రకాశం,చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల్లో – బురేవిని ఎదుర్కోవడానికి అటు శ్రీలంక నుంచి భారత తూర్పుతీరమంటా అప్రమత్తమైంది. ఈ తుఫాన్ ప్రభావంతో బుధ, గురువారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తు అంచనాలు వస్తున్నాయి.