
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. సామాన్యులు నుంచి సెలబ్రిటీల దాకా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల డీసీసీ బ్యాంక్ మేనేజర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు వైద్యులు తెలిపారు. అతన్ని వెంటనే క్వారంటైన్ కు తరలించిన అధికారులు చికిత్స అందిస్తున్నారు. దీంతో బ్యాంక్ ను కొద్దిరోజుల పాటు మూసివేసిన ఉన్నతాధికారుల బ్యాంక్ ను పూర్తిగా శానిటైజేషన్ చేస్తున్నారు. పలువురు బ్యాంక్ ఉద్యోగులను హోమ్ క్వారంటైన్లో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
మరోవైపు, ప్రైమరీ కాంటాక్ట్ లపై అధికారులు ఆరా తీస్తున్నారు. గత పదిరోజులుగా బ్యాంక్కు వచ్చిన ఖాతాదారులు, మేనేజర్కు సన్నిహితంగా ఉన్నవారిని కూడా హోమ్ క్వారంటైన్లో ఉండాలని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారు మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు స్వచ్చంద లాక్ డౌన్కు విధించుకుంటున్నారు.