రేపే ‘ మహా ‘ ఎపిసోడ్ ఫైనల్ ! సోనియా నిర్ణయంపై ఉత్కంఠ

| Edited By: Srinu

Nov 21, 2019 | 1:00 PM

మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు ఇంకా తర్జనభర్జనలు పడుతున్నాయి. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక కమిటీ.. సిడబ్ల్యుసి గురువారం ఉదయం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో సమావేశమైంది. సేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి మరింత ‘ పటిష్టం ‘ గా కలవాలంటే ఇంకా కొన్ని ‘ చిక్కులు ‘ ఉన్నాయని ఈ పార్టీ (కాంగ్రెస్) వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. బహుశా శుక్రవారం తాము తుది నిర్ణయం తీసుకోవచ్ఛునని పార్టీ సీనియర్ నేత […]

రేపే  మహా  ఎపిసోడ్ ఫైనల్ ! సోనియా నిర్ణయంపై ఉత్కంఠ
Follow us on

మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీలు ఇంకా తర్జనభర్జనలు పడుతున్నాయి. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక కమిటీ.. సిడబ్ల్యుసి గురువారం ఉదయం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో సమావేశమైంది. సేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి మరింత ‘ పటిష్టం ‘ గా కలవాలంటే ఇంకా కొన్ని ‘ చిక్కులు ‘ ఉన్నాయని ఈ పార్టీ (కాంగ్రెస్) వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. బహుశా శుక్రవారం తాము తుది నిర్ణయం తీసుకోవచ్ఛునని పార్టీ సీనియర్ నేత కె.సి.వేణుగోపాల్ తెలిపారు. ఏ విధమైన అభ్యంతరాలున్నా ‘ మహాకూటమి ‘ పై ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని సోనియాకు సీనియర్ నాయకులు సలహా ఇఛ్చినట్టు తెలుస్తోంది. మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఎదుర్కోవాలంటే.. ఆ పార్టీ అధికారంలోకి రాకుండా చూడాలంటే ‘ గట్టి నిర్ణయం ‘ తీసుకోక తప్పదని ఈ నేతలు భావిస్తున్నారు. ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో బుధవారం సమావేశమైన కాంగ్రెస్ నాయకులు తమపార్టీకి, సేనకు సంబంధించి మరికొన్ని అంశాలను పరిష్కరించవలసి ఉందని అభిప్రాయపడ్డారు. సేన-ఎన్సీపీ, కాంగ్రెస్ లేనిదే రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వం ఏర్పడబోదని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. ఈ మూడు పార్టీలు కనీస ఉమ్మడి కార్యక్రమంపై చర్చించాయని, అయితే అధికార పంపిణీ ప్రస్తావన ఈ చర్చల్లో రాలేదని తెలుస్తోంది.
అటు-ప్రధాని మోదీతో ఎన్సీపీ నేత శరద్ పవార్ సమావేశమైన అనంతరం.. కాంగ్రెస్ నాయకులు ఈ తాజా పరిణామంపై ఆ పార్టీతో మంతనాలు జరిపారు. అప్పుడే ఈ భేటీపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించింది. మహారాష్ట్రలో వ్యవసాయ సంక్షోభంపై తాను ప్రధానితో చర్చించానని పవార్ చెబుతున్నారు. అయితే ఆయనకు రాష్ట్రపతి పదవిని బీజేపీ ఇవ్వజూపుతున్నదనే కొత్త వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో.. ఎన్సీపీ తోడ్పాటుతో బీజేపీ.. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు యత్నిస్తోందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.
సేనతో పోలిస్తే ఎన్సీపీకి కేవలం రెండు మూడు స్థానాలు తక్కువగా ఉన్నాయి. ఇది కమలం పార్టీకి అవసరమైన మెజారిటీకి దోహదపడవచ్ఛునని భావిస్తున్నారు. ఈ వార్తలు కూడా కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి. అయితే సేన నేత సంజయ్ రౌత్ మాత్రం.. అన్ని అవరోధాలూ పరిష్కారమయ్యాయని, రెండునుంచి అయిదు రోజుల్లోగా రాష్ట్రంలో సేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమాగా చెబుతున్నారు.