ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించనందుకు.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. కార్మికులకు న్యాయం జరిగేదాకా పోరాడుతామని ఆయన తెలిపారు. కార్మికులు, ఉద్యోగ సంఘాలు తరలివచ్చి ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మరోవైపు హైదరాబాద్లో సీనియర్ నేత షబ్బీర్ అలీ నివాసంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ సభ్యుడు దయాసాగర్ సమావేశమై.. ప్రగతి భవన్ ముట్టడి వ్యూహంపై చర్చించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలను సైతం కేసీఆర్ ధిక్కరిస్తున్నారని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా సర్కార్ స్పందించడం లేదన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలతో 50 వేల ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఉత్తమ్ చెప్పారు.