China: విలవిల్లాడుతున్న డ్రాగన్ కంట్రీ.. ఏకంగా రెడ్ ప్రకటన.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోందంటే..

China: చైనాలో సెగలు పుట్టిస్తోంది హీట్ వేవ్.. గతంలో ఎన్నడూ లేనివిధంగా హీట్ వేవ్‌తో రెడ్ అలర్ట్ ప్రకటించింది డ్రాగన్‌ కంట్రీ.

China: విలవిల్లాడుతున్న డ్రాగన్ కంట్రీ.. ఏకంగా రెడ్ ప్రకటన.. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోందంటే..
China

Updated on: Aug 23, 2022 | 9:20 AM

China: చైనాలో సెగలు పుట్టిస్తోంది హీట్ వేవ్.. గతంలో ఎన్నడూ లేనివిధంగా హీట్ వేవ్‌తో రెడ్ అలర్ట్ ప్రకటించింది డ్రాగన్‌ కంట్రీ. అటు విద్యుత్తు కొరతతో షాంఘైలోని చీకట్లు కమ్ముకోనున్నాయి. అవును డ్రాగన్‌ కంట్రీలో కరువు విలయతాండవం చేస్తోంది. దీంతో అక్కడివాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నదులు సైతం ఎండిపోతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలంతా విద్యుత్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారు. హైడ్రోపవర్‌ ఉత్పత్తి సరిగా జరకపోవడంతో ఫ్యాక్టరీలు, వాణిజ్య సముదాయాలు మూతపడుతున్నాయి. కరెంట్ కోతలతో ప్రజలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు చాంగ్‌కింగ్ ప్రాంతంలోనే న‌మోదు అవుతున్నాయి. దీంతో దేశంలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

చాంగ్‌కింగ్ ప్రాంతంలో ఉన్న 34 కౌంటీల్లోని 66 న‌దులు ఎండిపోయాయి. చాంగ్‌కింగ్ ప్రాంతంలో 60 శాతం త‌క్కువ వ‌ర్షపాతం న‌మోదు అయ్యింది. అనేక ప్రాంతాల్లో నేల‌లు ప‌గుళ్లు ప‌ట్టాయి. అటు చైనాలో కార్చిచ్చు ఘ‌ట‌న‌లు ఎక్కువ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ఆ దేశం క‌రువు హెచ్చరిక‌లు జారీ చేసింది. యాంగ్జీ న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో పంట‌ల్ని కాపాడుకునేందుకు ప్రత్యేక బృందాల‌ను రంగంలోకి దించింది. విప‌రీత‌మైన వేడి వాతావ‌ర‌ణం వ‌ల్ల.. ఆ ప్రాంతంలో ఉన్న పంట‌లు, అడువులు అంటుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. ఇక చైనా తన దేశ అభివృద్ధికి చిహ్నంగా చూపించే షాంఘైలోని చీకట్లు కమ్ముకోనున్నాయి. ఫేస్‌ ఆఫ్‌ షాంఘైగా నిలిచే ‘ది బండ్‌’లో లైటింగ్‌ను రెండ్రోజులపాటు నిలిపివేయనున్నారు. వూహాన్‌లో యాంగ్జూనదిపై ఉన్న లైటింగ్‌షోను కూడా నిలిపివేశారు. ముఖ్యంగా సిచువాన్‌ ప్రావిన్స్‌ గత 60 ఏళ్లలో ఎన్నడూ చూడనంత కరవును ఎదుర్కొంటోంది. దీంతో విద్యుత్తు కొరత తీవ్రం కావడంతో పంపిణీ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం సిచువాన్‌లో విద్యుత్తుపై రేషన్‌ విధించడంతో ఉత్పత్తి పడిపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..