AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందం.. వరద నష్టం పరిశీలన

భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తోంది.

రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందం.. వరద నష్టం పరిశీలన
Balaraju Goud
|

Updated on: Oct 22, 2020 | 2:08 PM

Share

గత కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలు తెలంగాణను తీవ్ర నష్టాన్ని మిగిల్చి వెళ్లింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ వశిష్ఠ నేతృత్వంలోని అధికారుల బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. వరద ప్రాంతాల్లో పరిస్థితులను కేంద్ర బృందానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ వివరించారు.

గురువారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్న ఐదుగురు సభ్యుల గల కేంద్ర బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఉన్నతాధికారులతో సమావేశమైంది. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. అధిక వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టం, సంబంధిత వివరాలను అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. నష్టానికి సంబంధించి ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం కేంద్ర బృందం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనుంది. కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలో వరద పరిస్థితిని అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.

మరికాసేపట్లో పాతబస్తీ చంద్రాయణ గుట్ట పల్లె చెరువు, ఇతర వరద ముంపు ప్రాంతాలను ఇద్దరు సభ్యుల బృందం పర్యటించనుంది. రెండో బృందం సిద్దిపేట జిల్లాలోనూ సందర్శించనున్నారు. జిల్లాల్లో పంట నష్టాన్ని కూడా కేంద్రం బృందం అంచనా వేయనుంది. పర్యటన అనంతరం రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది కేంద్ర బృందం.