సంచలనం సృష్టించి హథ్రాస్‌ ఘటనలో కీలక మలుపు.. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన హథ్రాస్‌ దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ కీలక ఆధారాలను రాబట్టింది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై కేంద్ర దర్యాప్తు సంస్థ చార్జిషీట్‌ దాఖలు చేసింది.

సంచలనం సృష్టించి హథ్రాస్‌ ఘటనలో కీలక మలుపు.. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
Follow us

|

Updated on: Dec 18, 2020 | 3:51 PM

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన హథ్రాస్‌ దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ కీలక ఆధారాలను రాబట్టింది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై కేంద్ర దర్యాప్తు సంస్థ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆమెను చిత్రహింసలకు గురిచేసి అనంతరం హతమార్చినట్లు ఆభియోగాలు నమోదు చేసింది. నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు స్థానిక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కాగా, ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆమె నాలుక కోసి, వెన్నుముక విరిచి అత్యంత పాశవికంగా దాడి చేసినట్లు సీబీఐ అధికారులు చార్జిషీట్ లో పేర్కొన్నారు.

నలుగురు కర్కోటకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, తల్లితో కలిసి గడ్డి కోస్తున్న సమయంలో ఆమెను లాక్కెళ్లి, బాధితురాలిని చిత్ర హింసలకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక, బాధితురాలి అత్యంత దయనీయ పరిస్థితిలో మరణించడం, మృతదేహానికి పోలీసులే అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడం వంటి పరిణామాలు పలు అనుమానాలకు తావిచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహాజ్వాలలు వెల్లువెత్తాయి. దీంతో సెప్టెంబరు 30న ఉత్తరప్రదేశ్ సర్కార్.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరగడంతో ఆ తర్వాత కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణను అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. ఎట్టకేలకు సీబీఐ స్థానిక కోర్టులో పూర్తిస్థాయి చార్జిషీట్ దాఖలు చేసింది.