
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పుడు ఫిలింనగర్లో తెగ చర్చ జరుగుతోంది. అఖిలప్రియ, తన భర్త భార్గవ్తో కలిసి నిర్మాణ సంస్థను నెలకొల్పబోతున్నారట. అయితే కరోనా నేపథ్యంలో సినిమా పరిశ్రమ తీవ్ర ఒడిదొడుగులు ఎదుర్కొంటొంది. థియేటర్లు మూతపడి 100 రోజులు అవుతున్నాయి. అవి మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియడం లేదు. ఈ సమయంలో అఖిల ప్రియ ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారా అని సినిమా జనాలు చర్చించుకుంటున్నారు.
మరి ఇలాంటి పరిస్థితుల్లో అఖిలప్రియ కొత్తగా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేస్తారా..? లేదా తమ ఆలోచనను పక్కన పెట్టి ఇతర వ్యాపారాల్లోకి అడుగులు వేస్తారా..?అనేది తెలియాల్సి ఉంది. కాగా అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డికి సినిమాలు అంటే మంచి ఇంట్రస్ట్ ఉండేది. టాలీవుడ్ లో నిర్మాతగా ఆయన కొన్ని సినిమాలు తెరకెక్కించారు కూడా. అఖిల ప్రియ కూడా తండ్రి బాటలోనే అడుగులు వేయబోతుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.