కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను సవాల్ చేస్తూ తాము సుప్రీంకోర్టుకెక్కుతామని కేరళ సిఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఈ వారంలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని, వీటి బదులు ప్రత్యామ్నాయ చట్టాల విషయాన్ని పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు. కాగా మంగళవారం భారత్ బంద్ ను పురస్కరించుకుని అనేక బీజేపీయేతర రాష్టాలు దీన్ని సక్సెస్ చేసే యోచనలో ఉన్నాయి. వివిధ ప్రతిపక్షాలు, ట్రేడ్ యూనియన్లు కూడా ఈ బంద్ లో పాల్గొంటామని ఇదివరకే ప్రకటించాయి. అటు-ఢిల్లీలోని అన్ని బార్ అసోసియేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టు కాంప్లెక్సుల్లో రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈ బంద్ 4 గంటలపాటు మాత్రం ఉంటుందని కొన్ని రైతు సంఘాలు ప్రకటించగా.. భారతీయ కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ మాత్రం రోజంతా బంద్ పాటిస్తామని స్పష్టం చేశారు.
వేదికపైకి ఏ రాజకీయ నేతనూ ఆహ్వానించబోమని ఆయన చెప్పారు. విపక్షాలు ఈ బంద్ కు మద్దతునిస్తున్నాయని, కానీ ఈ పార్టీల నాయకులమీద తమకు నమ్మకం లేదని పాల్ చెప్పారు. కాగా-యూపీ, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు తాము భారత్ బంద్ ను అనుమతించే ప్రసక్తి లేదని పేర్కొన్నాయి.