నాగ్రోటా కుట్రను ఛేదిస్తున్న ఆర్మీ అధికారులు… వెలుగులోకి వస్తున్న కొత్త నిజాలు..

|

Nov 21, 2020 | 9:55 PM

జమ్ముకశ్మీర్‌లో నాగ్రోటా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్‌లో తిష్టవేసిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీప్‌ మసూద్‌ అజార్‌ సోదరుడు ముఫ్తీ అస్కర్‌ భారత్‌లో మరోసారి ముంబై తరహా దాడులకు కుట్ర చేసినట్టు వెల్లడయ్యింది.

నాగ్రోటా కుట్రను ఛేదిస్తున్న ఆర్మీ అధికారులు... వెలుగులోకి వస్తున్న కొత్త నిజాలు..
Follow us on

Nagrota Conspiracy : జమ్ముకశ్మీర్‌లో నాగ్రోటా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్‌లో తిష్టవేసిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీప్‌ మసూద్‌ అజార్‌ సోదరుడు ముఫ్తీ అస్కర్‌ భారత్‌లో మరోసారి ముంబై తరహా దాడులకు కుట్ర చేసినట్టు వెల్లడయ్యింది. భద్రతా బలగాలను టార్గెట్‌ చేయాలని ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురు ఉగ్రవాదులకు పాక్‌ నుంచే కమాండ్స్‌ వచ్చాయి.

శాటిలైట్‌ ఫోన్ల సంభాషణలను ట్యాప్‌ చేసిన నిఘావర్గాలు కచ్చితమైన సమాచారం ఇవ్వడంతో ఉగ్రదాడిని తిప్పికొట్టింది సైన్యం. కశ్మీర్‌ లోయలో హింసను రెచ్చగొట్టడానికి జైషే కమాండర్లు ముఫ్తీ అస్ఘర్‌తో పాటు కారీ జరార్‌ కుట్ర చేసినట్టు గుర్తించారు. ఉగ్రవాదుల కుట్రపై నిఘా వర్గాలకు ముందే సమాచారం రావడంతో పెనుప్రమాదం తప్పింది.

నలుగురు ముష్కరులను హతం చేసిన బలగాలను స్వయంగా ప్రధాని మోదీ అభినందించారు. పాకిస్తాన్‌ లోని పంజాబ్‌ ప్రాంతం నుంచి ఈ నలుగురు ఉగ్రవాదులు శంకర్‌బాగ్‌ బ్రిడ్జి మీదుగా భారత్‌ లోని సాంబా సెక్టార్‌లో ప్రవేశించారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల దగ్గరి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు, గ్రెనేడ్లు , 11 ఏకే 47 రైఫిళ్లు , 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

లొంగిపోవాలని నలుగురు ఉగ్రవాదులను పదేపదే హెచ్చరించినప్పటికి పట్టించుకోలేదు. చివరకు నలుగురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్లో ఖతం చేశాయి భద్రతా బలగాలు. పాక్‌ ఐఎస్‌ఐ ప్రమేయం తోనే ఈ దాడికి కుట్ర జరిగినట్టు కేంద్రం తేల్చిచెప్పింది.

జైషే మహ్మద్‌ ఉగ్రవాదుల సహకారంతో కాశ్మీర్‌ లోయలో ఎన్నికల ప్రక్రియను ఆపేందుకు ఈ కుట్ర చేసినట్టు భావిస్తున్నారు. పాక్‌లో తయారైన వైర్‌లెస్‌ సెట్లు , ఆయుధానలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్రమత్తంగా ఉన్న సైన్యం కశ్మీర్‌లో ఉగ్రదాడులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. ఎల్‌వోసీ దగ్గర అదనపు బలగాలను మొహరించారు.