
Chandrababu Naidu Bail Plea: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్పై గురువారం ఏపీ హైకోర్టులో గట్టి వాదనలు జరిగాయి. బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో వాదించారు. ఆరోగ్యానికి సంబంధించి చంద్రబాబు ఇచ్చిన నివేదికలపై కూడా అనుమానం ఉందని అన్నారు. తప్పుడు హెల్త్ రిపోర్టులిచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరుపక్షాల తరపున సుదీర్ఘంగా సాగిన వాదనలు సాగాయి. వాదనల అనంతరం ధర్మాసానం.. ఈ కేసు తీర్పును రిజర్వ్ చేస్తూ వాయిదా వేసింది.
స్కిల్ కేసులో వాదనలు సుధీర్ఘంగా కొనసాగాయి. స్కిల్ స్కామ్లో డబ్బులు ఎలా చేతులు మారాయో హైకోర్టు దృష్టికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీసుకొచ్చారు. మూడు పది రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా మార్గం ద్వారా కోట్ల చిన్నప్ప అనే వ్యక్తిహైదరాబాద్కు డబ్బు తరలించారని తెలిపారు. బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజుల ద్వారా ఈ విషయం బయటపడిందని అన్నారు. బోస్, కన్వేల్కర్ మెసేజ్ల ద్వారా డబ్బు హైదరాబాద్కు చేరినట్టు తేలిందని వెల్లడించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ వ్యవహారమంతా సాగిందని కోర్టుకు వివరించారు. నిధుల మళ్లింపు జరిగిందనే విషయాన్ని సీమెన్స్ సంస్థ కూడా నిర్థారించిందని పొన్నవోలు వెల్లడించారు. అంతే కాదు నిధుల విడుదలకు సంబంధించి ఎవరైనా అభ్యంతరం చెప్తే వారిని 24 గంటల్లోపు బదిలీ చేస్తామని అప్పటి ప్రధాన కార్యదర్శి అధికారులకు హుకుం జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత డబ్బు ఒక్కసారే విడుదల చేయవద్దని అప్పటి ఆర్థిక కార్యదర్శి చెప్పినా పట్టించుకోలేదని అన్నారు.
టీడీపీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు ఒక్కరే ఆడిటర్గా ఉన్నారని పొన్నవోలు హైకోర్టు దృష్టికి తెచ్చారు. అంతే కాదు చంద్రబాబు అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టుకు పొన్నవోలు విజ్ఞప్తి చేశారు. చట్టం ముందు అందరూ సమానులేనని అన్నారు. ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక సందేశం వెళ్లాలని తెలిపారు. చంద్రబాబుకు బెయిలిస్తే సాక్షుల ప్రభావితం చేస్తారని న్యాయస్థానానికి వివరించారు.
బాబు ఆరోగ్యం, నిధులు మళ్లింపుపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను బాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు వాయిదా వేసింది.
మరో వైపు స్కిల్ స్కామ్లో సీమెన్స్ కంపెనీ ప్రతినిధి సుదీష్ చంద్రకాంత్ షా అప్రూవర్గా మారారు. ఆయనను వచ్చే నెల 5న కోర్టులో హాజరుపరచాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది. స్కిల్ స్కామ్లో A13న సిదీష్ చంద్రకాంత్ ఉన్నారు. తాను అప్రూవర్గా మారినట్టు ఇప్పటికే ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..