వెండితెరలు ఇప్పట్లో వెలిగేలా లేవు ..!
ఈ నెల 15 నుంచి సినిమాహాళ్లను, మల్టీప్లెక్స్ను సుబ్బరంగా తెరచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆ ఆలోచన చేయడం లేదు.. కొన్ని రాష్ట్రాలలో సినిమా థియేటర్లు ఓపెన్ అయినా 50 సీట్ల సామర్థ్యంతో...
ఈ నెల 15 నుంచి సినిమాహాళ్లను, మల్టీప్లెక్స్ను సుబ్బరంగా తెరచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆ ఆలోచన చేయడం లేదు.. కొన్ని రాష్ట్రాలలో సినిమా థియేటర్లు ఓపెన్ అయినా 50 సీట్ల సామర్థ్యంతో నడపడం తమవల్ల కాదని తెరచిన థియేటర్లను మూసేసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు.. కరెంట్ ఖర్చులు, మెయింటైన్స్ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇలా ఉంటే లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయాలనే గట్టి నిర్ణయంతో ఉన్న నిర్మాతలు ఇప్పుడా ప్రయత్నంలో పడ్డారు.. సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తారు సరే… చూట్టానికి ప్రేక్షకులు వస్తారా అన్నదే అనుమానం.. కరోనా వైరస్ వ్యాప్తి భయంకరంగా ఉన్న ఇలాంటి సమయంలో జనం థియేటర్లకు వెళతారా? రెండున్నర గంటల వినోదం కోసం లేనిపోని తలనొప్పులు ఎందుకని అనుకుంటారా? ఇలాంటి అనుమానాలే లోకల్ సర్కిల్స్ వారికి కూడా వచ్చింది.. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆన్లైన్ సర్వే నిర్వహించింది.. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. దేశవ్యాప్తంగా 8,274 మంది సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇందులో కేవలం ఏడు శాతం మంది మాత్రమే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ఉందన్నారు. మళ్లీ ఇందులో నాలుగు శాతం మంది కొత్త సినిమా అయితేనే థియేటర్కు వెళ్లి చూస్తామన్నారు.. మిగతా మూడు శాతం మందికి కొత్త పాత అన్న తేడా లేదు.. సినిమా అయితే చాలు థియేటర్కు వెళ్లి చూసేందుకు రెడీగా ఉన్నారు. 74 శాతం మంది అసలు థియేటర్ ఛాయలోకి వెళ్లమని కరాఖండిగా చెప్పేశారు.. రెండు శాతం మంది ఎటూ చెప్పలేకపోయారు.. మిగిలిన 17 శాతం మంది మాత్రం థియేటర్లో సినిమా చూడాలన్న ఆసక్తి, అభిరుచి తమకు లేవని చెప్పేశారు.. ఇదే లోకల్ సర్కిల్స్ జులైలో నిర్వహించిన సర్వేలో మాత్రం 72 శాతం మంది, ఆగస్టు సర్వేలో 77 శాతం మంది ప్రస్తుతం తాము థియేటర్లకు వెళ్లడానికి సిద్ధంగా లేమన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కోరి ఎందుకు వైరస్ను అంటించుకోవడమన్న భావనతో వారున్నారు.. హాయిగా ఇంటిపట్టునే ఓటీటీ ప్లాట్ఫామ్లలో సినిమాలు చూసి ఎంజాయ్ చేయవచ్చనే భావనతో ఉన్నారు. గత ఏడు నెలలుగా థియేటర్లు మూసే వున్నాయి.. సినిమారంగం బాగా దెబ్బతిన్నది.. సినిమా పరిశ్రమపై ఆధారపడినవారి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి.. థియేటర్లలో పని చేసేవారి పరిస్థితి మరీ దారుణం.. జూనియర్ ఆర్టిస్టులు ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు..కొందరు కాయాకష్టం చేసి బతుకుతున్నారు. కూలీనాలీ చేసుకుని కడుపునింపుకుంటున్నవారు ఇంకొందరు.. ఇవి చేతకానివారు ఆత్మహత్యలు చేసుకున్నారు. కర్నాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో థియేటర్లు తెరచుకున్నాయి కానీ ప్రేక్షకులే కరువవుతున్నారు.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, చత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఎందుకొచ్చిన తలనొప్పులనే అభిప్రాయంతో ఉన్నాయి.. అందుకే థియేటర్ల ఓపెనింగ్పై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు..