కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్డౌన్లతో విదేశాల్లో చిక్కుపోయిన భారతీయులను, భారత్లో చిక్కుకున్న విదేశీయులను ఆయా దేశాలకు తరలించి శభాష్ అనిపించుకున్న ఎయిరిండియా మరో మంచి పనికి పూనుకుంది. మన రైతులకు మేలు చేసేందుకు వారు పండించిన పళ్లు, కూరగాయలను కృషి ఉడాన్ పథకం కింద రెండు విమానాల్లో లండన్కు, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్కు తరలించేందుకు సిద్ధమైంది.
కోవిద్-19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలకు పైగా పాకింది. ఏప్రిల్ 13న లండన్, ఏప్రిల్ 15న ఫ్రాంక్ఫర్ట్కు రెండు విమానాలు పళ్లు, కూరగాయలు తీసుకెళ్తాయని విమానయాన వర్గాలు తెలిపాయి. దాంతోపాటు తిరిగి వచ్చేటప్పుడు అవసరమైన మెడికల్ సామాగ్రిని తీసుకొస్తాయని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. కాగా, విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు తరలించి రైతులకు లాభం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి ఉడాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
కోవిద్ 19 దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కాగా.. చైనా నుంచి వైద్య పరికరాలు, కోవిడ్-19 రిలీఫ్ మెటీరియల్ను దిగుమతి చేసుకునేందుకు భారత్ ఆ దేశంతో ఒక వైమానిక మార్గాన్ని ఏర్పరచుకుంది. దాంట్లో భాగంగా ఎయిరిండియా విమానం AI349 శనివారం ఉదయం షాంఘై నుంచి ముంబైకి మెడికల్ సామాగ్రిని తీసుకొచ్చింది. వైద్య సామాగ్రి తరలించేందుకు ఎయిరిండియాతో పాటు ప్రైవేటు విమానయాన సంస్థలు స్పైస్జెట్, బ్లూ డార్ట్, ఇండిగో విమానాలకు పౌర విమానయానశాఖ అనుమతులుచ్చింది.
Also Read: లాక్ డౌన్ నేపథ్యంలో.. కర్ఫ్యూ పాస్లు అడిగారని.. పోలీసు చేయి నరికేశారు..