
AIIMS to gradually resume its OPD services: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నిలిచిపోయిన ఓపీడీ (అవుట్ పేషెంట్ సర్వీస్) సేవలను ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) మంగళవారం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మూడు నెలలపాటు సేవలను నిలిపివేసింది. మొదటి దశలో కేవలం ఫాలోఅప్ పేషెంట్లకు మాత్రమే ఓపీ చూస్తామని, అదికూడా ఒక్కో విభాగంలో రోజుకు పదిహేను మందికి మాత్రమే సేవలందిస్తామని ఎయిమ్స్ సీనియర్ అధికారులు పేర్కొన్నారు.
ఈవినింగ్ స్పెషాలిటీ క్లినిక్లలో మాత్రం ఓపీ సేవలను అనుమతించట్లేదని పేర్కొన్నారు. కాగా.. అన్ని విభాగాల హెచ్వోడీలతో సమావేశం ఏర్పాటు చేసి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. డాక్టర్ అపాయింట్మెంట్ ఆయా విభాగాల ద్వారాగానీ, ఆన్లైన్లోగా ఇవ్వనున్నట్లు చెప్పారు. అపాయింట్మెంట్ ఇచ్చిన డాక్టర్ల వివరాలు, అపాయింట్మెంట్ పొందిన పేషెంట్ పేరు, ఫోన్ నంబర్ను 48 గంటల ముందు ఆన్లైన్లోగానీ, ఆయా విభాగాల ఇన్చార్జిలకుగానీ అందజేస్తామని వివరించారు. ఈ మేరకు అన్ని విభాగాల హెచ్వోడీలకు మార్గదర్శకాలు జారీచేశామన్నారు.