తమిళనాడులోని ఓ నదీ తీరంలో మూడు వేలకు పైగా ఆధార్ కార్డులు పడివున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. తిరుప్పూరు జిల్లా తిరుత్తురైపూండి వద్ద ముళ్లియారు నది ఒడ్డున పిల్లలు ఆడుకుంటుండగా వారికి పెద్ద సంఖ్యలో ఆధార్ కార్డులు కనిపించాయి. ఈ విషయాన్ని ఆ చిన్నారులు స్థానికులకు తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ స్థలంలో కొన్ని సంచుల నిండా ఆధార్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు నది తీరానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఆధార్ కార్డులన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. వాటిని కట్టిమేడు, అతిరంగం, వడపట్టి గ్రామాల ప్రజలకు చెందినవని అధికారులు భావిస్తున్నారు. కాగా, పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.