Telangana: ఇదేం అరాచకం సామీ.. అప్పు చెల్లించలేదని ఇంత దారుణమా.. ఇంటికి తోరణంగా..

| Edited By: Balaraju Goud

Oct 20, 2024 | 2:11 PM

అప్పు డబ్బులు చెల్లించాలని అనితపై ఒత్తిడి తీసుకువచ్చాడు రంజా. తన బతుకుదెరవే కష్టంగా ఉందని, తర్వాత అప్పు డబ్బులు కడతానని అనిత హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళిపోయింది.

Telangana: ఇదేం అరాచకం సామీ.. అప్పు చెల్లించలేదని ఇంత దారుణమా.. ఇంటికి తోరణంగా..
Callmoney Harassment
Follow us on

కాల్‌మనీ కాల నాగులు పట్టణాలకే పరిమితం కాకుండా ఇపుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా బుసలు కొడుతున్నారు. అప్పుల వసూలుకు ఫోన్లు చేసి తిట్టడం, ఒత్తిడి చేయడం వంటివి కాకుండా కొత్త పద్ధతుల్లో బాధితులను వెంటాడి, వేటాడి, వేధిస్తున్నారు. అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం లేదని అప్పు తీసుకున్న మహిళా ఇంటికి చెప్పులు, చీపురు, చాటలతో తోరణం కట్టాడో కాల్ నాగు. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం అస్లా తండాకు చెందిన వాంకుడోత్ కీమా, అనిత దంపతులు అదే గ్రామానికి చెందిన ధరావత్ రంజా వద్ద మూడేళ్ల క్రితం రూ.లక్ష అప్పుగా తీసుకున్నారు. కొద్ది కాలానికి కీమా అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పు తీర్చలేని స్థితిలో బతుకు దెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో దసరా పండుగకు అనిత గ్రామానికి వచ్చింది. అప్పు డబ్బులు చెల్లించాలని రంజా.. అనితపై ఒత్తిడి తీసుకువచ్చాడు. తన బతుకుదెరవే కష్టంగా ఉందని, తర్వాత అప్పు డబ్బులు కడతానని అనిత హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళిపోయింది.

అయితే అప్పు డబ్బులు చెల్లించడం లేదని ఆగ్రహంతో రంజా.. అనిత ఇంటికి పాత చెప్పులు, చీపురు, పాత చాటలను దండగా తయారు చేసి తోరణంగా కట్టాడు. అంతటితో ఆగకుండా తమ అప్పు చెల్లించడం లేదని అనితకు గ్రామంలో ఇకపై ఎవరూ అప్పు ఇవ్వవద్దని డప్పు చాటింపు వేయించాడు. ఈ విషయాన్ని గ్రామస్థులు హైదరాబాద్‌లో ఉన్న అనితకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామానికి వచ్చిన అనిత, పోలీసులను ఆశ్రయించింది. తన ఇంటికి చెప్పుల దండలు వేసి ఊర్లో డప్పు చాటింపు చేయడంతో తన పరువు పోయిందని, తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త మరణంతో బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వెళ్లిన తనను, కావాలనే చెడు ప్రచారం చేస్తున్నారని గోడు వెళ్లబోసుకుంది. రంజాతోపాటు అతనికి సహకరించి మరో ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..