సడెన్గా మంట పెరిగిపోతుంది.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నారంటే గ్యాస్ బండ.. బాంబులా పేలిపోవడం ఖాయం. ఏం జరిగిందో తెలుసుకునేలోపే ఇళ్లంతా ధ్వంసం. ప్రాణాలూ గాల్లో కలిసిపోతాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు పేలిపోతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయాయి. రీసెంట్గా చూస్తే.. మొన్నటికి మొన్న అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ ధాటికి మిద్దె కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలయ్యారు. నాలుగు రోజుల క్రితం కర్నూలు జిల్లా జొన్నగిరిలో వంట చేస్తుండగా బాంబ్లా పేలింది గ్యాస్ బండ. ఈ ఘటనలో తల్లీకొడుకు మృతి చెందారు. అంతకుముందు.. నిజామాబాద్ జిల్లా ఎడవల్లిలో కూడా వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయ్యింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇళ్లంతా ధ్వంసమైంది. కుటుంబసభ్యులు అలర్ట్ కావడంతో ప్రాణాలు దక్కాయి. లేదంటే ఊహించని ఘటన జరిగి ఉండేది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా గ్యాస్ బండలు భయపెడుతున్నాయి. సిలిండర్లు గ్యాస్ బాంబుల్లా పేలుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? ఎండ తీవ్రత పెరగడం వల్లనా? నిర్లక్ష్యపు లీకేజీలు కారణమా? ఈ ప్రశ్నలకు సమాధానం అంత ఈజీ కాదు. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2017లో 309 సిలిండర్లు పేలాయి. 315 చనిపోగా.. 84మంది గాయపడ్డారు. 2018లో 307 సిలిండర్స్ బ్లాస్ట్ అయ్యాయి. 318 చనిపోగా.. 41 మంది గాయపడ్డారు. 2019లో 314 ప్రమాదాలు జరగ్గా.. 330 మంది చనిపోయారు. 59 మంది గాయపడ్డారు. 2020లో 245 సిలిండర్లు బాంబుల్లా పేలాయి. మృతుల సంఖ్య 254గా ఉంది. మరో 66 మంది గాయపడ్డారు.
గ్యాస్ రీఫిల్ చేయడం దగ్గరనుంచి.. మంట వెలిగించేవరకు వివిధ దశల్లో జాగ్రత్తలు అవసరం. వంటింట్లోని సిలిండర్ ఎంత సేఫ్? ఆ విషయం ఎలా కనుక్కోవడం? ప్రాణాలపైకి రాకుండా ఉండాలంటే ఏం చెయాలి? అన్న విషయాలపై అవగాహన ఉండాలి. ఒకవైపు గ్యాస్ సిలిండర్లు సప్లై చేస్తున్న ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం.. మరోవైపు వినియోగదారుల పొరపాట్ల వల్ల వంటింట్లో విస్ఫోటనాలు జరుగుతున్నాయి. గ్యాస్ బండల భద్రతా ప్రమాణాలపై అవగాహన లోపం, లీకేజీలపై ఏమరుపాటు ప్రాణాలు తీస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు స్టాండర్డ్స్ని గాలికి వదిలేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు అత్యవసర సేవలు అందించడంలో విఫలం అవుతున్నాయి. అసలు.. ఎంతమంది.. టెక్నికల్ టీమ్ను నియమించుకున్నారు? ఎన్ని ఇళ్లకు వాళ్లు సర్వీస్ చేశారు? ఇదంతా నేతిబీర చందమే.
అసలు, గ్యాస్ సిలిండర్ల నాణ్యతను కంపెనీలు పరిశీలించాల్సి ఉంటుంది. బండలకూ ఎక్స్పైరీ ఉంటుంది. సిలిండర్ లైఫ్టైమ్ పదేళ్లే. మరి, వాటిని మార్చేస్తున్నారా? దాని సామర్థ్యాన్ని బట్టి.. మరో ఐదేళ్లు రీఫిల్లింగ్ చేయేచ్చు. లేదంటే తుక్కుగా మార్చేయాలి. ఈ టెస్టులు చేస్తున్నారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఇంకో విషయం.. రీఫిల్లింగ్ జరిగే ప్రతిసారి సిలిండర్ బాడీని పరీక్షించాలి. అదైనా జరుగుతోందా అంటే డౌటే. టెర్మినల్కు వచ్చిన సిలిండర్ను మొక్కుబడిగా పరిశీలిస్తున్నారనే విమర్శలున్నాయి. సిలిండర్పై డ్యూడేట్ అనేది ఒకటి ఉంటుందని ఎంతమందికి తెలుసు? వినియోగదారుల్లో అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణం.
గ్యాస్ బండ ఇంటికి రాగానే.. డబ్బులివ్వడం కంటే ముందు సీల్ చూడండి. కరెక్టుగా ఉందా, లేదా అని. డ్యూడేట్ ఏంటో చెక్ చేయాలి. సీల్ తీయగానే ఓపెన్ రింగ్ కట్ అయినా.. గ్యాస్ వాసన వచ్చినా సిలిండర్ను వెనక్కి పంపడమే మంచిది. గ్యాస్ స్టవ్ రెగ్యులేటర్, బర్నర్ను రెగ్యులర్గా తనిఖీ చేసుకోవాలి. రెండేళ్లకోసారి స్టవ్ మార్చడం మంచిది. వంట పూర్తవగానే రెగ్యులేటర్ ఆఫ్ చేయడం ఉత్తమం. గ్యాస్ సిలిండర్ ఉన్న చోట వెంటిలేషన్ అనేది మస్ట్. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు.