
భారత్ దేశం ఓ పెద్ద ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటోంది. అది డయాబెటిస్. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్తో బాధపడుతున్నారు. మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలి మార్పులు, పట్టణీకరణ, జన్యుపరమైన కారణాలు ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలుగా మారాయి. ICMR-INDIAB అధ్యయనం ప్రకారం.. దేశ జనాభాలో డయాబెటిస్ ప్రాబల్యం 11.4 శాతం ఉంది. పట్టణాల్లో ఇది 14.2 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.3 శాతంగా నమోదైంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. డయాబెటిస్ ఉన్న వారిలో 60 శాతం మందికి తమకు వ్యాధి ఉందన్న విషయం కూడా తెలియదు. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలైన తమిళనాడు, గోవా, పంజాబ్, మహారాష్ట్రల్లో డయాబెటిస్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
వైద్యుల మాటల్లో.. డయాబెటిస్ ఒకే రకం వ్యాధి కాదు. ప్రధానంగా ఇది మూడు రకాలుగా ఉంటుంది. వాటిని సరిగ్గా గుర్తిస్తేనే సరైన చికిత్స సాధ్యం అవుతుంది.
టైప్–1 డయాబెటిస్ : సాధారణంగా పిల్లలు, యువతలో వస్తుంది. శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. వీరికి జీవితాంతం ఇన్సులిన్ అవసరం. జన్యు పరంగా సక్రమించేది, ఫ్యామిలీ హిస్టరీ కారణాలు.
టైప్–2 డయాబెటిస్: భారత్లో అత్యధికంగా కనిపించే రకం. లైఫ్ స్టైల్, ఊబకాయం,స్ట్రెస్ వల్ల వచ్చేది. సరైన ఆహారం, వ్యాయామంతో దీన్ని నియంత్రించవచ్చు.
టైప్ -3 గెస్టేషనల్ డయాబెటిస్: గర్భధారణ సమయంలో మహిళల్లో వస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదమని వైద్యులు హేచ్చరిస్తున్నారు.
గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ వైఫల్యం, చూపు కోల్పోవడం, నరాల సమస్యలు వంటి తీవ్ర సంక్లిష్టతలు వచ్చే ప్రమాదం ఉంది. చాలా మంది రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా నియంత్రణలో లేవని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా ఒక్కప్పుడు షుగర్ రోగం ధనికుల రోగం అనేవారు… కానీ ఇప్పుడు ఆది అన్ని వర్గాలను కాటేస్తుంది. భారత్లో ప్రధాన సమస్య ఆలస్యంగా గుర్తించడం. 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. జీవనశైలి మార్పులే అసలు పరిష్కారమని డాక్టర్స్ సూచిస్తున్నారు.
కొన్ని హెల్త్ రిపోర్ట్స్, సర్వేలు పూర్తిగా ఫార్మా కంపెనీల ప్రయోజనాల కోసమే రూపొందిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాధుల సంఖ్యను అతిశయంగా చూపిస్తూ, మందుల వినియోగాన్ని పెంచే దిశగా ఈ నివేదికలు ఉపయోగపడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో భయం పెంచి, దీన్ని ఒక ఫార్మా మాఫియా గేమ్లా మార్చుతున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందుకే ఆరోగ్య డేటాపై స్వతంత్ర, పారదర్శక పరిశీలన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక డయాబెటిస్ బాధితులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. సరైన ఆహారం, రోజువారీ వ్యాయామం, ముందస్తు స్క్రీనింగ్, అవగాహనతో ఈ మౌన మహమ్మారిని ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ల హెచ్చరిక ఒక్కటే.. ఇప్పుడే జాగ్రత్త పడితేనే రేపటి ప్రమాదం తప్పుతుంది.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..