
వేసవి వచ్చిందంటే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, దాంతో పాటు కిడ్నీలో రాళ్ల సమస్యలు కూడా అధికమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువకుల్లో ఈ కేసులు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అధిక వేడి, డీహైడ్రేషన్, తగినంత ద్రవాలు తీసుకోకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందుకే వేసవిని ‘రాళ్ల సీజన్’ అని కూడా పిలుస్తున్నారు.
ముంబైలోని జైనోవా షాల్బీ ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ చింతన్ గాయక్వాడ్ ప్రకారం, వేసవిలో అధిక చెమట కారణంగా శరీరం నీటిని కోల్పోతుంది. దీనికి తగినంత నీటిని తాగకపోతే, శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. “శరీరంలో నీరు తగ్గితే, మూత్రం చిక్కబడుతుంది. దీనివల్ల కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు మూత్రంలో పేరుకుపోయి, స్ఫటికాలుగా మారి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి” అని డాక్టర్ గాయక్వాడ్ వివరించారు.
కిడ్నీలో రాళ్లు అనేవి మూత్రపిండాలలో ఏర్పడే గట్టి నిర్మాణాలు. ఇవి ఖనిజాలు, లవణాలతో కూడి ఉంటాయి. ఇవి చిన్న ఇసుక రేణువుల నుండి గోల్ఫ్ బాల్ అంత పెద్దవిగా కూడా ఉండవచ్చు. మూత్ర నాళం ద్వారా ప్రయాణించేటప్పుడు ఇవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. వీపు లేదా పక్కటెముకల వైపు తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం, తరచుగా మూత్ర విసర్జన, మంటగా అనిపించడం వంటివి ప్రధాన లక్షణాలు.
ఎక్కువ చెమట, తక్కువ నీరు: వేసవిలో వేడిమికి ఎక్కువ చెమట పడుతుంది. దీనికి తగ్గట్టుగా నీరు తాగకపోతే మూత్రం చిక్కబడుతుంది.
అధిక ఉప్పు వాడకం: వేసవిలో ఎక్కువగా తినే చిరుతిళ్లు, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, ఇది రాళ్ల ఏర్పడటానికి దారితీస్తుంది.
ఆహారపు అలవాట్లు: చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ ఎక్కువ తీసుకోవడం, నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తక్కువ తినడం కూడా ఒక కారణం.