AP Junior Doctors: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో రెసిడెంట్ జూనియర్ డాక్టర్లు సమ్మె షురూ చేశారు. విధులు బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే సమ్మె సరైన్ మోగించిన జూడాలు ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ఈ ఉదయం నుంచి జూనియర్ రెసిడెంట్ డాక్టర్లు సమ్మె లోకి దిగారు. ఆరోగ్య బీమా, ఎక్స్గ్రేషియా సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు తమకు కొవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని.. స్టయిఫండ్లో టీడీఎస్ కోత విధించవద్దని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ఇవాళ (ఈనెల 9న) కొవిడ్తో సంబంధం లేని విధులు, 10వ తేదీన కొవిడ్ విధులు, 12 వతేదీన కొవిడ్ అత్యవసర విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలు, ప్రభుత్వాసుపత్రుల్లో సేవలందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీలకు రెసిడెంట్ స్పెషలిస్టులకు ఏపీ సర్కారు నిన్ననే గుడ్ న్యూస్ చెప్పింది. వారందరికీ గౌరవ వేతనాన్ని పెంచుతూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సీనియర్ రెసిడెంట్ వైద్యులకు 70 వేలకు , రెసిడెంట్ డెంటిస్టులకు 65 వేలు, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు 85 వేలకూ వేతనాన్ని పెంచుతూ నిన్న సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పెంపు 2020 సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.