
చాలా మంది పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే చూస్తారు. కొంతమంది వాటితోనే తన దినచర్యను ప్రారంభించడంతో పాటు ఖాళీ సమయాల్లో కూడా ఎక్కువ సేపు వాటితోనే గడుపుతుంటారు. చాలా పెంపుడు జంతువులు పిల్లలు ఆడుకునేందుకు, వృద్ధులకు సహచరులుగా సహకారం అందిస్తూ ఉంటాయి. అయితే ఈ పెట్స్ పెంపకం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనిషి, జంతువుల బంధం ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలపై ఇటీవల కాలంలో పరిశోధనలు ప్రారంభించారు. ఈ క్రమంలో పలు ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు పరిశోధకులు వివరిస్తున్నారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరుని ఈ పెట్స్ ప్రభావితం చేసి, దానిని సంరక్షిస్తాయని వివరిస్తున్నారు.
యూఎస్ లోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ 50 ఏళ్లు పైబడిన పెద్దలపై ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో ఐదు సంవత్సరాలకు పైగా పెంపుడు జంతువును కలిగి ఉన్నవారు.. పెంపుడు జంతువు లేని వారితో పోల్చితే కాగ్నిటివ్ మెమరీ పరీక్షలలో మెరుగ్గా స్కోర్ చేసినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ‘పెట్ ఎఫెక్ట్’ వయసు మీరి పోతున్న మెదడుకు ఆరోగ్యాన్ని ఇస్తుందని, జ్ఞాపకశక్తిని పెంచడంలో తోడ్పడుతోందని వివరించారు. 2010 నుంచి 2016 వరకూ నిర్వహించిన ఈ అధ్యయనం ఇంకా చాలా ఆసక్తి కర ఫలితాలు వెల్లడైనట్లు పరిశోధకులు చెబుతున్నారు.
అంతేకాక ఇటీవల చేసి పలు అధ్యయనాలు కూడా పెంపుడు జంతువును కలిగి ఉండటం మంచిదని సూచిస్తున్నాయి. కుక్కను కలిగి ఉండటం వలన పెంపుడు జంతువుల యజమానులు త్వరగా లేచి ఎక్కువ తిరిగేలా చేస్తాయనట. ఆ సందర్భంలో, రోజువారీ కదలికలు పెరిగి మెదడు ఆరోగ్యం పెరుగుతుందని చెబుతున్నారు. పెంపుడు జంతువుల వల్ల ఒంటరితనం నుంచి ఉపశమనం పొందవచ్చని, అలాగే దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించి, సంతోషంగా జీవించే అవకాశం కల్పిస్తాయంటున్నారు. వాస్తవానికి ఒంటరితనం, ఒత్తిడి మనిషిని బాగా ప్రభావితం చేస్తాయి.. ముఖ్యంగా వృద్ధాప్యంలో. ఎందుకంటే ఒంటరితనం మన మెదడు యొక్క నిర్మాణాన్ని పనితీరును మార్చేస్తుంది. అందుకే ఒకపెంపుడు జంతువును కలిగి ఉండటం ద్వారా వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనాన్ని కోల్పోకుండా చేయడంతో పాటు జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..