చనిపోయే ముందు మనలో జరిగేది ఇదేనట.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..

జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు.. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే. మరణం ముంచుకొస్తున్న తరుణంలో, ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాలపై శాస్త్రవేత్తలు శతాబ్దాలుగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.

చనిపోయే ముందు మనలో జరిగేది ఇదేనట.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..
Life Best Moments

Updated on: Jan 02, 2023 | 2:08 PM

Life Best Moments: జన్మించిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు.. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే. మరణం ముంచుకొస్తున్న తరుణంలో, ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాలపై శాస్త్రవేత్తలు శతాబ్దాలుగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. మరణించే క్రమంలో ఏం జరుగుతుందన్న అంశంపై తాజాగా జరిపిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మెదడులో ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా..? మరణిస్తున్న వ్యక్తి మెదడు స్కాన్‌లో తన జీవితమంతా అనుభవించిన క్షణాలు మెరుపులా కళ్ల ముందుకు వచ్చినట్లు వెల్లడైంది. మరణం, మరణానంతర అనుభవాలను పరిశోధించే సమయంలో మెదడులో ఏమి జరుగుతుంది అనేది శతాబ్దాలుగా న్యూరో సైంటిస్టులను అబ్బురపరిచే ప్రశ్నగానే మారిన క్రమంలో ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ అనే జర్నల్‌ తాజాగా ఓ కీలక అధ్యయానికి సంబంధించిన విషయాలను ప్రచురించింది. మరణానికి ముందు, మరణం సంభవించే సమయంలో మన మెదడు చురుకుగా మారి సమన్వయంతో పనిచేస్తుందని పేర్కొంది. ఈ పరిశోధనలో జరిపిన పరీక్షల్లో మరణానికి ముందు ఆర్కెస్ట్రేట్ చేసినట్లు వెల్లడించింది. ఈ పరిశోధన అమెరికాలోని లూయిస్‌విల్లే విశ్వవిద్యాలయంలోని న్యూరోసర్జన్ అజ్మల్ జెమ్మార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

“ఈ పరిశోధన నుంచి మేం నేర్చుకునేది ఏమిటంటే.. మన ప్రియమైనవారు కళ్ళు మూసే (చనిపోయే) ముందు.. విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నక్రమంలో వారి మెదడు వారి జీవితంలో అనుభవించిన కొన్ని మంచి క్షణాలను గుర్తు చేసుకుని ఉండవచ్చు” అని డాక్టర్ అజ్మల్ జెమ్మార్ చెప్పారు.

ఎస్టోనియాలోని టార్టు విశ్వవిద్యాలయంలోని న్యూరో సైంటిస్టులు.. మూర్ఛ వ్యాధితో మరణిస్తున్న 87 ఏళ్ల రోగి ప్రతీ కార్యాచరణను స్కానింగ్ తదితర పరీక్షల ద్వారా నమోదు చేశారు. వారు కలలు కనే సమయంలో, ధ్యానం సమయంలో సంభవించే రిథమిక్ వేవ్ నమూనాలను కనుగొన్నారు. మూర్ఛలను గుర్తించడానికి, రోగికి చికిత్స చేయడానికి వారు నిరంతర ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ (EEG)ని ఉపయోగించారు. ఈ రికార్డింగ్ సమయంలో రోగికి గుండెపోటు వచ్చి మరణించాడు. ఈ ఊహించని సంఘటన.. చనిపోతున్న మానవ మెదడు కార్యాచరణను మొదటిసారిగా రికార్డ్ చేయడానికి ఉపయోగపడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

“మేము మరణం సమయంలో 900 సెకన్ల మెదడు కార్యకలాపాలను అధ్యయనం చేశాము. గుండె కొట్టుకోవడం ఆగిపోయే ముందు మరియు తర్వాత 30 సెకన్లలో ఏమి జరిగిందో పరిశోధించడానికి నిర్దిష్ట పరీక్షలను జరిపేలా ప్రణాళిక చేశాం” అని జెమ్మార్ చెప్పారు. “గుండె పనిచేయడం ఆగిపోయే ముందు, తరువాత మేము గామా డోలనాలు అని పిలచే నాడీ డోలనాలలో మార్పులను చూశాము. డెల్టా, తీటా, ఆల్ఫా, బీటా డోలనాలు వంటి వాటిలో కూడా మార్పులను గమనించామని’’ తెలిపారు.

మెదడు డోలనాలు (సాధారణంగా ‘brain waves’ అని పిలుస్తారు) అనేది.. సజీవ మానవ మెదడుల్లో సాధారణంగా ఉండే లయబద్ధమైన మెదడు కార్యకలాపాల నమూనాలు, గామాతో సహా వివిధ రకాల డోలనాలు మెమరీ ఫ్లాష్‌బ్యాక్‌లతో అనుబంధించినట్లుగా.. ఏకాగ్రత, కలలు కనడం, ధ్యానం, జ్ఞాపకశక్తిని తిరిగి పొందడం, సమాచార ప్రాసెసింగ్, చేతన అవగాహన వంటి అధిక-అభిజ్ఞా విధులు జరుగుతాయని పరిశోధకులు తెలిపారు.

“జ్ఞాపకశక్తి పునరుద్ధరణలో ప్రమేయం ఉన్న డోలనాలను ఉత్పత్తి చేయడం ద్వారా, మెదడు మనం చనిపోయే ముందు ముఖ్యమైన జీవిత సంఘటనల గురించి నేమరువేసుకుంటుంది.. ఇది మరణానికి సమీపంలో ఉన్న అనుభవాలలో నివేదించినట్లుగా ఉంటుంది” అని జెమ్మార్ చెప్పారు. “ఈ పరిశోధనలు ఖచ్చితంగా జీవితం ఎప్పుడు ముగుస్తుంది, అవయవ దానం చేసే సమయానికి సంబంధించిన ముఖ్యమైన తదుపరి ప్రశ్నలను ఉత్పన్నం చేస్తుంది.” అని వివరించారు.

ఈ అధ్యయనం మానవులలో చనిపోయే ప్రక్రియలో ప్రత్యక్ష మెదడు కార్యకలాపాలను పరీక్షించేందుకు చేసి మొదటి పరిశోధన. అయితే, గామా డోలనాల్లో ఇలాంటి మార్పులు గతంలో నియంత్రిత పరిసరాలలో ఉంచిన ఎలుకలలో గమనించారు. మరణం సమయంలో, మెదడు జీవసంబంధ ప్రతిస్పందనను నిర్వహించడం, అమలు చేయడం సాధ్యమవుతుందా లేదా అనేది పరీక్షించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us