
దేశంలో పిల్లలు, యువతలో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కీలక విధాన పత్రాన్ని విడుదల చేసింది. ‘లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్ (Let’s Fix Our Food – LFOF) కన్సార్టియం’ రూపొందించిన ‘పిల్లలు, కిశోరుల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆహార వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ప్రాధాన్య విధాన చర్యలు’ అనే పాలసీ డాక్యుమెంట్ను నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ ఎం. శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ విధాన పత్రం ప్రధానంగా పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం, అధిక బరువు, అలాగే ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే మధుమేహం, హైపర్టెన్షన్ వంటి నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NCDs) నివారణపై దృష్టి సారించింది.
అధికారిక నివేదికల ప్రకారం, 2025 నాటికి దేశంలో 5 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు మారకపోతే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాల్య ఊబకాయం భారంలో భారత్ వాటా 11 శాతానికి పైగా ఉండే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.
పిల్లలు, యువతను లక్ష్యంగా చేసుకుని అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర (HFSS) ఉన్న ఆహార పదార్థాల ప్రకటనలపై ప్రస్తుతం ఉన్న స్వీయ నియంత్రణ విధానానికి బదులుగా చట్టబద్ధమైన కఠిన నిబంధనలు తీసుకురావాలని సూచించింది. అలాగే డిజిటల్ మీడియా, టెలివిజన్, ఇతర ప్రచార మాధ్యమాల్లో తప్పుడు ఆరోగ్య ప్రయోజనాల పేరుతో చేసే ప్రకటనలను నిషేధించాలని పేర్కొంది.
ప్యాకేజ్డ్ ఫుడ్ ఉత్పత్తుల ముందు భాగంలోనే సులభంగా అర్థమయ్యే పోషకాహార హెచ్చరిక లేబుళ్లు (Front-of-Pack Nutrition Labelling) తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. దీంతో తల్లిదండ్రులు, పిల్లలు ఆహారంలో కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఒకే చూపులో గుర్తించగలుగుతారు.
పాఠశాల క్యాంటీన్లు, స్కూల్ పరిసర ప్రాంతాల్లో జంక్ ఫుడ్ విక్రయాలను నియంత్రించాలని సూచించింది. వాటి స్థానంలో పండ్లు, సంపూర్ణ ధాన్యాలతో తయారైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపింది. అదే సమయంలో Nutrition Environment Assessment Toolkit for Schools (NEAT-S) ద్వారా పాఠశాలల్లో ఆహార వాతావరణాన్ని క్రమం తప్పకుండా అంచనా వేయాలని సూచించింది.
అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలు (HFSS Foods), అలాగే చక్కెర అధికంగా ఉండే పానీయాలపై ప్రత్యేక ఆరోగ్య పన్ను (Health Tax) విధించాలని పాలసీ సూచించింది. దీంతో జంక్ ఫుడ్ వినియోగం తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రజలకు మరింత అందుబాటు ధరల్లో అందించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ఈ సిఫార్సులను ఆయుష్మాన్ భారత్ – స్కూల్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోగ్రామ్ వంటి జాతీయ కార్యక్రమాలతో అనుసంధానం చేయాలని సూచించింది. దీని ద్వారా పిల్లల్లో పోషకాహార అవగాహన, శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం పెంచవచ్చని పేర్కొంది.
LFOF కన్సార్టియం ఈ సందర్భంగా రెండు ముఖ్యమైన సాధనాలను కూడా విడుదల చేసింది.
ఈ కార్యక్రమానికి యూనిసెఫ్ ఇండియా (UNICEF India), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (PHFI), గ్లోబల్ హెల్త్ అడ్వకసీ ఇన్క్యుబేటర్ (GHAI) సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, “పిల్లలు, యువతలో పెరుగుతున్న ఊబకాయం మరియు ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే వ్యాధులను నియంత్రించాలంటే శాస్త్రీయ ఆధారాలతో కూడిన, బహుళ రంగాల సమన్వయంతో కూడిన విధానాలు అత్యంత అవసరం. ‘లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్’ వంటి కార్యక్రమాలు ఆరోగ్యకరమైన ఆహార వాతావరణాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని పేర్కొన్నారు.