యాంటీబయోటిక్స్ అధికంగా వాడొద్దు.. ఈ మార్గదర్శకాలు పాటించాలంటూ వైద్యులకు ICMR సూచన..

|

Nov 28, 2022 | 8:00 AM

సాధారణంగా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే ఆ రోగానికి సంబంధించిన మందుతో పాటు యాంటిబయోటిక్స్‌ వాడటాన్ని చాలామంది అలవాటు చేసుకుంటారు. వైద్యులు కూడా చాలామంది యాంటీబయోటిక్స్‌ను రాస్తారు. చిన్న చిన్న అనారోగ్య..

యాంటీబయోటిక్స్ అధికంగా వాడొద్దు.. ఈ మార్గదర్శకాలు పాటించాలంటూ వైద్యులకు ICMR సూచన..
Antibiotics
Follow us on

సాధారణంగా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే ఆ రోగానికి సంబంధించిన మందుతో పాటు యాంటిబయోటిక్స్‌ వాడటాన్ని చాలామంది అలవాటు చేసుకుంటారు. వైద్యులు కూడా చాలామంది యాంటీబయోటిక్స్‌ను రాస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా కొంతమంది అయితే మెడికల్‌ షాప్‌కి వెళ్లి పేర్లు చెప్పి మరీ అడిగి తెచ్చుకుంటారు. అయితే యాంటీబయోటిక్స్ వాడే విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలని, ఎక్కువుగా వాటిని వాడొద్దని భారత వైద్య పరిశోధన మండలి- ఐసీఎంఆర్‌ హెచ్చరించింది. యాంటీబయోటిక్స్‌ వినియోగం విషయంలో పలు మార్గదర్శకాలు జారీ చేసింది. యథేచ్ఛగా యాంటీబయోటిక్స్‌ వినియోగంతో.. వ్యాధికారక క్రిముల్లో వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతోందని వెల్లడించింది. దీంతో సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడం సవాల్‌గా మారుతోందని తెలిపింది. స్వల్ప జ్వరం, శ్వాసనాళాల్లో వాపు వంటి అనారోగ్యాలకు యాంటీబయోటిక్స్ వాడకంపై హెచ్చరికలు జారీ చేసింది. రోగులకు యాంటీబయోటిక్స్‌ను సూచించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని వైద్యులకు సూచించింది.

చర్మం, మృదు కణజాల ఇన్ఫెక్షన్‌లకు ఐదు రోజులు, సాధారణ న్యుమోనియా విషయంలో ఐదు రోజులు, ఆసుపత్రిలో ఉన్న సమయంలో సోకిన న్యుమోనియాకు ఎనిమిది రోజుల యాంటీబయోటిక్‌ చికిత్స అందించాలని ఐసీఎంఆర్‌ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు జ్వరం, ప్రోకాల్సిటోనిన్ స్థాయిలు, తెల్ల రక్తకణాల సంఖ్య, రేడియాలజీ వంటివాటిపై ఆధారపడకుండా.. క్లినికల్‌ డయోగ్నసిస్‌ చేపట్టాలని పేర్కొంది. తద్వారా సరైన యాంటీబయోటిక్‌ ఇవ్వొచ్చని తెలిపింది. రక్త పరీక్షలు, సంబంధిత యాంటీబయోటిక్‌ పనిచేస్తుందా.. లేదా అనేది పరీక్షించకముందే అందించే యాంటీబయోటిక్‌ చికిత్సా విధానాన్ని తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారి విషయంలో తగ్గించాలని సూచించింది.

గతంలోనూ యాంటీబయోటిక్స్ వాడకం విషయంలో పలు మార్గదర్శకాలను జారీచేసింది. కాగా.. యాంటిబయోటిక్స్‌ వినియోగం భారత్‌లో అత్యధికంగా ఉందని, అందులో అజిత్రో మైసిన్‌ మొదటి స్థానంలో ఉన్నట్లు గతంలో ఓ అధ్యయనం వెల్లడించిన విషయం తెలిసిందే. కరోనాకు ముందు తరువాత కూడా భారతీయులు అతిగా యాంటిబయోటిక్స్‌ను వినియోగిస్తున్నట్లు లానెట్స్ చేపట్టిన తన పరిశోధనల్లో తెలిపింది. దేశవ్యాప్తంగా ఫార్మా ట్రాక్‌ డేటా అధ్యయం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. యాంటిబయోటెక్స్‌లో చాలా వరకు సెంట్రల్‌ డ్రగ్‌ రెగ్యులేటర్‌ ఆమోదం పొందలేదని, వీటిని వెంటనే నియంత్రించాలని కూడా పిలుపునిచ్చింది. భారత్‌లో యాంటిబయోటెక్స్‌ను అధికంగా వినియోగిస్తున్నందున… వాటిపై నియంత్రణ విధించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపింది. జాతీయ, రాష్ట్ర స్థాయి ఏజన్సీల మధ్య భేదాలుండటం వలన పరిమితుల కారణంగా ఈ యాంటిబయోటిక్స్‌ లభ్యత, వినియోగం, విక్రయాన్ని నియంత్రిచడం కష్టతరమౌతోందని అధ్యయనం తేల్చింది. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్‌ విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..