Coronavirus: నీటితో కరోనా వ్యాప్తి జరగనే జరగదు..అనుమానం అవసరం లేదు..స్పష్టం చేసిన విజయ రాఘవన్

|

May 08, 2021 | 7:09 AM

Coronavirus Spread: కరోనా ఎలా వ్యాపిస్తుంది అనేదానిపై విపరీతమైన అనుమానాలు మనలో ఉన్నాయి. రోజుకో రకమైన వార్తలు ఈ విషయంపై వింటూ వస్తున్నాము. కరోనా నీటి ద్వారా కూడా వ్యాపిస్తుంది అంటూ చాలాకాలంగా ప్రచారంలో ఉంది.

Coronavirus: నీటితో కరోనా వ్యాప్తి జరగనే జరగదు..అనుమానం అవసరం లేదు..స్పష్టం చేసిన విజయ రాఘవన్
Coronavirus Spread
Follow us on

Coronavirus: కరోనా ఎలా వ్యాపిస్తుంది అనేదానిపై విపరీతమైన అనుమానాలు మనలో ఉన్నాయి. రోజుకో రకమైన వార్తలు ఈ విషయంపై వింటూ వస్తున్నాము. కరోనా నీటి ద్వారా కూడా వ్యాపిస్తుంది అంటూ చాలాకాలంగా ప్రచారంలో ఉంది. అయితే, నీటి ద్వారా కరోనా వ్యాప్తి జరగదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వైరస్ నీళ్ళలో పడితే నిర్వీర్యం అయిపోతుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్‌ స్పష్టం చేశారు. నీటిలో పడితే కరోనా వైరస్ శక్తి పూర్తిగా పోతుందనీ, అక్కడ నుంచి వ్యాపిస్తుందనే భయం అవసరం లేదనీ ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన భరోసా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను యమునా నదిలో పారవేస్తున్నారు. ఈ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. ‘మనుషులు ఎదురెదురుగా ఉన్నప్పుడు వెలువడే తుంపర్ల ద్వారానే ప్రధానంగా వైరస్‌ విస్తరిస్తుంది. గాలిలో వ్యాప్తిచెందే అంశం గాలివీచే దిశపై ఆధారపడి ఉంటుంది. గాలివాటు ఎటు ఉంటే అటువైపు కొంత దూరం వరకు వైరస్‌ విస్తరిస్తుంది. తలుపులు మూసిన నాలుగు గోడల మధ్య వైరస్‌ ఎక్కువ కేంద్రీకృతమవుతుంది. తలుపులు తెరిస్తే పడిపోతుంది. నీటి ద్వారా విస్తరిస్తుందన్న ఆందోళన అవసరం లేదు’’ అని తెలిపారు.

ఇక రాఘవన్ ఇటీవల దేశంలో మూడోవేవ్ వచ్చే అవకాశం ఉందంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దేశంలో కట్టుదిట్టమైన కట్టడి చర్యలు చేపడితే మూడో ఉద్ధృతి రాకపోవచ్చని పేర్కొన్నారు. స్థానికంగా, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో చేపట్టే కట్టడి చర్యలు ఎంత ధృడంగా ఉన్నాయి అనేదానిపై ఈ ఉధృతి ఆధారపడి ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లుగా టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌, సర్వైలెన్స్‌ విధానాలను కట్టుదిట్టంగా అమలు చేస్తే వ్యాధి లక్షణాలు లేని వారి నుంచి వైరస్‌ విస్తరించడాన్ని అరికట్టొచ్చని వివరించారు. మాస్క్‌ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించే వారికి రక్షణ ఉంటుందన్నారు. ఇంతవరకు జాగ్రత్తలు తీసుకొని, ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే వైరస్‌ వ్యాపిస్తుందని హెచ్చరించారు.

ఆ తరువాతే ‘స్పుత్నిక్‌ లైట్‌’…

సింగిల్ డోస్ టీకాల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ.. వాటి సమర్ధతను పరిశీలించిన తరువాతే, భారత్‌లో వినియోగానికి అనుమతిస్తామని నీతిఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. సింగిల్‌ డోస్‌ టీకా స్పుత్నిక్‌ లైట్‌ టీకా సమర్ధత కూడా పరిశీలించాలని చెప్పారు. అదేవిధంగా జాన్సన్ అండ్ జాన్సన్ కూడా ఒకే డోసు టీకా అనీ, ఇటువంటివి అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ వేగవంతం అవుతుందనీ తెలిపారు. ఒకే డోసు ద్వారా కరోనాను ఎదుర్కోగలం అంటే అది శుభవార్తే. కానీ, వాటిని పరిశీలించాకే నిర్ణయం తీసుకోగలం. శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన వీటి అనుమతులను పరిశీలిస్తాం’’ అని వెల్లడించారు.