
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే మధుమేహానికి కారణమవుతున్నాయి. చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకునేందుకు మందులు వాడుతూనే, చాలామంది ఆహార నియమాలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగా జొన్న రొట్టెలు తినడం ఒక సాధారణ అలవాటుగా మారింది. వీటిని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉంటుందని చాలామంది నమ్ముతారు. అయితే, ఈ నమ్మకంలో ఎంత నిజం ఉంది? జొన్న రొట్టెలతో నిజంగానే షుగర్ తగ్గుతుందా? వైద్య నిపుణుల అభిప్రాయం ఇప్పుడు చూద్దాం.
సీనియర్ డయాబెటాలజిస్ట్ నిపుణులు ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. “వరి బియ్యం త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. గోధుమలు కూడా షుగర్ స్థాయిలపై ఇదే ప్రభావాన్ని చూపుతాయి. అయితే, జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసెలు, క్వినోవా, ఓట్స్ వంటివి కాస్త ఆలస్యంగా జీర్ణం అవుతాయి. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత త్వరగా పెరగవు. కానీ, వీటన్నింటిలో గ్లైసెమిక్ స్థాయులు ఒకేలా ఉంటాయి. రాగుల్లో అయితే అవి ఇంకాస్త ఎక్కువ” అని డాక్టర్ రావు వివరించారు.
అలవాటు లేని పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని, కొవ్వు పదార్థాలు సరిగా జీర్ణం కాకుండానే కాలేయంలోకి చేరి ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు రావచ్చని వారు హెచ్చరించారు. అనవసరంగా ప్రయోగాలు చేసి ఇబ్బందులు పడొద్దని ఆయన సలహా ఇచ్చారు.
“ఈ రకం ఆహారం తాత్కాలికంగా షుగర్ తగ్గించినా, దీర్ఘకాలంలో ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఈ ఆహార ప్రయోగాలకు దూరంగా ఉండాలి” అని డాక్టర్ రావు స్పష్టం చేశారు.
మనం తీసుకునే ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత మేర పెంచుతాయి అనే కొలమానాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు.
55 కంటే తక్కువ ఉంటే: తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్
56-69 మధ్య ఉంటే: మధ్యస్థ గ్లైసెమిక్ ఇండెక్స్
70కి మించి ఉంటే: అధిక గ్లైసెమిక్ ఇండెక్స్
ముఖ్య గమనిక: ఇక్కడ అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు తప్పకుండా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవాలి. దీనిని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.