
ఆరోగ్యకరమైన ఆహారం అనుకుంటూ మనం తినే ఆకుకూరలు, కూరగాయలే ఒక్కోసారి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు వేదికగా మారుతున్నాయి. పిల్లల మెదడుపై దాడి చేసే ‘బ్రెయిన్ వార్మ్స్’ (Neurocysticercosis) గురించి తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ పురుగుల వల్ల కలిగే వాపు మూర్ఛలకు, తీవ్రమైన తలనొప్పికి ఎలా దారితీస్తుందో.. వీటి బారిన పడకుండా ఉండటానికి పాటించాల్సిన సులభమైన చిట్కాలు మీకోసం.
సాధారణంగా మనం మెదడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ కొన్ని రకాల పరాన్నజీవులు మెదడులోకి ప్రవేశించి తీవ్రమైన నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే మూర్ఛ వ్యాధికి ‘టెనియా సోలియం’ (Taenia solium) అనే పురుగు వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.
శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి? ఈ పురుగుల గుడ్లు మట్టిలో ఉంటాయి. మనం కూరగాయలను, ముఖ్యంగా క్యాబేజీ లేదా లెట్యూస్ వంటి ఆకుకూరలను సరిగ్గా కడగకుండా తిన్నప్పుడు లేదా సరిగ్గా ఉడికించకుండా తిన్నప్పుడు ఈ గుడ్లు మన శరీరంలోకి చేరుతాయి. అక్కడి నుంచి ఇవి రక్తప్రవాహం ద్వారా మెదడుకు చేరుకునే అవకాశం ఉంది.
మూర్ఛలు ఎలా వస్తాయి? మెదడులోకి ఈ పురుగు లేదా ఏదైనా బయటి కణాలు ప్రవేశించినప్పుడు, మన మెదడు వెంటనే స్పందిస్తుంది. ఆ పురుగు చుట్టూ ఒక రకమైన వాపు ఏర్పడుతుంది. ఈ వాపు కారణంగానే పిల్లల్లో తీవ్రమైన తలనొప్పి లేదా అకస్మాత్తుగా మూర్ఛలు వస్తాయి. పురుగులు మెదడులో పాకుతూ ఉండటం వల్ల కాకుండా, అవి కలిగించే ఇన్ఫెక్షన్ కు మెదడు ఇచ్చే ప్రతిచర్య వల్లే ఈ సమస్య తలెత్తుతుంది.
ముందస్తు జాగ్రత్తలు:
కూరగాయలను, ఆకుకూరలను వంట చేసే ముందు ఉప్పు నీటిలో బాగా కడగాలి.
ఆహారాన్ని పూర్తిగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి.
పిల్లలు మట్టిలో ఆడుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కునేలా చూడాలి.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండవచ్చు.
గమనిక : ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. దీనిని వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. నిపుణులైన వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.