
సీనియర్ నటి రాజలక్ష్మి గుర్తున్నారా.? ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆమె ఆతర్వాత సహాయక పాత్రల్లో నటించి అలరించారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ తల్లి పాత్రల్లో మెప్పించారు రాజ్యలక్ష్మీ. కాగా ఆమె తన సినీ ప్రస్థానం, ముఖ్యంగా శంకరాభరణం చిత్రం, దిగ్గజ దర్శకులు, సహ నటులతో తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె నటించిన ఎన్నో చిత్రాలలోకెల్లా శంకరాభరణం సినిమా తనకు ఒక ప్రత్యేక గుర్తింపును, శంకరాభరణం రాజలక్ష్మి అనే ఇంటిపేరును తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేశారు. ఫోన్లో కూడా ప్రజలు శంకరాభరణం రాజలక్ష్మి గారు అని పలకరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. శంకరాభరణం చిత్రం షూటింగ్ సమయంలో తన అనుభవాలను వివరిస్తూ, మొదటి రోజు కె. విశ్వనాథ్ గారు సన్నివేశాలను విడమర్చి చెప్పిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తాను చాలా భయస్తురాలిని అని, సెట్లో చంద్రమోహన్, సోమయాజులు, తులసి (చైల్డ్ ఆర్టిస్ట్గా) వంటి సీనియర్ నటుల మధ్య పనిచేయడం కొత్తగా అనిపించిందని తెలిపారు.
విశ్వనాథ్ గారు తనకు కావాల్సిన భావాలను రాబట్టడానికి ఓపికగా పదిసార్లు రిహార్సల్స్ చేయించారని, ఆయన ఒక గొప్ప కళాకారుడని కొనియాడారు. ఆయన దగ్గర ఒక మంచి విద్యార్థిలా నేర్చుకున్నానని, తనకు వచ్చిన పేరు ఆయన గొప్పతనమే తప్ప తనది కాదని వినయంగా చెప్పారు. శంకరాభరణం తర్వాత వెంటనే కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నిప్పులాంటి నిజం చిత్రంలో నటించానని, అది శంకరాభరణం పాత్రకు పూర్తిగా విరుద్ధమైన మోడరన్ గర్ల్ పాత్ర అని రాజలక్ష్మి వివరించారు. రెండు చిత్రాలను దాదాపు ఒకేసారి, కేవలం ఒక షెడ్యూల్ తేడాతో చేశామని, అది ఎలా నిర్వహించారో ఇప్పుడు ఆలోచించినా ఆశ్చర్యంగా ఉందని ఆమె తెలిపారు. రాఘవేంద్ర రావు గారు జోవియల్గా ఉంటారని, ఆయన తన భయాన్ని పోగొట్టి సరదాగా నటింపజేశారని పేర్కొన్నారు.
నందమూరి బాలకృష్ణతో కలిసి రౌడీ రాముడు కొంటె కృష్ణుడు చిత్రంలో నటించిన అనుభవాలను కూడా రాజలక్ష్మి పంచుకున్నారు. అది తన మూడవ సినిమా అని, రామారావు గారితో పనిచేయడం తమకు ఎన్నో జన్మల పుణ్యమని భావించామని తెలిపారు. రామారావు గారు తమకు రాముడు, కృష్ణుడు, దేవుడు వంటివారని, ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి అని అన్నారు. బాలకృష్ణ చాలా సరదాగా ఉండేవారని, వారిద్దరి వయస్సు దగ్గరగా ఉండటంతో స్టూడెంట్ క్యారెక్టర్లను సరదాగా చేశామని గుర్తుచేసుకున్నారు. ఇటీవలే మురళీమోహన్ గారితో కలిసి ఒక ప్రాజెక్ట్ చేశానని, బాలకృష్ణను తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు కలిశానని తెలిపారు. తెలుగులో హీరోయిన్గా తక్కువ సినిమాలు చేసినప్పటికీ, మలయాళం, కన్నడ భాషల్లో ఎక్కువ చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించానని రాజలక్ష్మి పేర్కొన్నారు. శంకరాభరణం సినిమాలోని ప్రొడ్యూసర్లు, దర్శకులు, నటులు అయిన అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ, చంద్రమోహన్, సోమయాజులు, అలాగే సంగీత దర్శకులు కె.వి. మహాదేవన్, సినిమాటోగ్రాఫర్ బాలమహేంద్ర వంటి ఎందరో దిగ్గజాలు నేడు లేరని విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, శంకరాభరణం చిత్రం ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్గా నిలిచిందని, అది తనకెంతో సంతృప్తినిచ్చిందని ఆమె అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.