
తెలుగులో ఒకప్పుడు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సురేష్. దివంగత హీరోయిన్ సౌందర్యతో కలిసి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఓ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సౌందర్యను అద్భుతమైన వ్యక్తి అని అన్నారు. ఆమె మొదటి సినిమా “అమ్మోరు” నుండి చివరి సినిమా “దేవీపుత్రుడు” వరకు ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని గుర్తుచేసుకున్నారు. సాధారణంగా పరిస్థితులు, పారితోషికం మారినప్పుడు, స్థాయి పెరిగినప్పుడు వ్యక్తుల ప్రవర్తన మారుతుందని, కానీ సౌందర్య విషయంలో ఇది జరగలేదని ఆయన అన్నారు.
ఆమె ఎప్పుడూ ఒక ఆప్తుడిని, బంధువును పలకరించినట్టే అందరినీ గౌరవంగా పలకరించేదని సురేష్ గుర్తు చేసుకున్నారు. ఆఫ్-స్క్రీన్లో ఆమెకున్న అద్భుతమైన చిరునవ్వు, చురుకైన కళ్ళు (డ్యాన్సింగ్ ఐస్) ఆమె వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాని అన్నారు. జీవితం పట్ల ఆమెకున్న ప్రేమ ఆమె నటనలో కూడా స్పష్టంగా కనిపించేదని, సహజంగా, సజీవంగా ఉండేదని సురేష్ వివరించారు. సౌందర్య అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని, అది తన జీవితంలో రెండుసార్లు మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలలో ఒకటని సురేష్ చెప్పుకొచ్చారు.
సౌందర్య సినీ ప్రయాణం “అమ్మోరు” సినిమాతో ప్రారంభమైంది. ఆమెను శ్యాంప్రసాద్ రెడ్డి బెంగళూరు నుండి ఎంపిక చేశారు. అప్పటికి ఆమె చాలా చిన్న వయస్సుదని, 16 లేదా 17 ఏళ్లు ఉంటాయని సురేష్ గుర్తుచేసుకున్నారు. “అమ్మోరు” షూటింగ్ సమయంలో సౌందర్య డైలాగులు నేర్చుకుని, ప్రతి షాట్కు ముందు సురేష్ను “సార్ సురేష్ గారు కరెక్టేనా? మీరు సీనియర్ కదా” అంటూ సంప్రదించేవారని సురేష్ తెలిపారు. “అమ్మోరు” ఆమె మొదటి సినిమా అయినప్పటికీ, ఆ సినిమా పూర్తై, తిరిగి కొంత భాగం తీసి, రెండోసారి విడుదలయ్యే నాటికి ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయిందని సురేష్ వెల్లడించారు.
ఆ తర్వాత సౌందర్యతో తాను హీరోగా, “దొంగాట” సినిమాలో విలన్గా, వెంకటేష్తో కలిసి కోడి రామకృష్ణ దర్శకత్వంలో “దేవీపుత్రుడు” సినిమాలో కూడా నటించినట్లు సురేష్ వివరించారు. “అమ్మోరు” సినిమా సమయంలో ఆమె ప్రవర్తన ఎలా ఉందో, “దేవీపుత్రుడు” లాంటి చివరి సినిమాల వరకు కూడా ఆమెలో ఏమాత్రం మార్పు రాలేదని సురేష్ ప్రశంసించారు. కొంతమంది నటులు తమ స్థాయి, పారితోషికం పెరిగే కొద్దీ ప్రవర్తనలో మార్పులు వస్తాయని, కానీ సౌందర్య విషయంలో ఇది జరగలేదని అన్నారు. తన జీవితంలో రెండుసార్లు మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్నానని, తన తాత, పెద్దమ్మ, అత్త, తండ్రి మరణించినప్పుడు కూడా తాను అంతగా బాధపడలేదని చెప్పారు. కానీ శ్రీహరి, సౌందర్య మరణాలు మాత్రం తనను చాలా బాధించాయని, అన్యాయంగా ఇంత తొందరగా వారిని తీసుకెళ్లిపోవడం దారుణమని ఆయన అన్నారు. సౌందర్య భర్త రఘు ఇప్పటికీ తనతో మాట్లాడుతుంటారని అన్నారు. ఆయనకు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని.. సౌందర్యే మళ్లీ పుట్టిందని తాను చెప్పానని గుర్తుచేసుకున్నారు.